సిటీబ్యూరో, సెప్టెంబరు 23 (నమస్తే తెలంగాణ) : ఆరు కిలోమీటర్లు.. ఏడేండ్లు.. ఇది ఒక్క ఫ్లై ఓవర్ నిర్మాణ పనులపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యపు వైఖరి.. వరంగల్ జాతీయ రహదారిపై ఉప్పల్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు 2018 సంవత్సరంలో ఉప్పల్ రింగు రోడ్డు- నారపల్లి వరకు 6.25 కిలోమీటర్ల మేరలో ఎలివేటెడ్ కారిడార్ పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఒప్పందం ప్రకారం రెండేళ్లలో పనులు పూర్తి చేయాలి.
ప్రాజెక్టులో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం భూ సేకరణ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయగా.. నిర్మాణ పనులు కేంద్ర ప్రభుత్వం జరపాల్సి ఉండగా.. సంవత్సరాల తరబడి పనులను కొనసాగిస్తూ వాహనదారుల కష్టాలను అధికం చేసింది. పనులు 40శాతం కూడా పూర్తి కాలేదు.. సర్వీస్ రోడ్డు గుంతలు పడి ప్రజా రవాణా సరిగా సాగక.. వర్షం పడితే వాహనాలు ముందుకు కదల్లేక వాహనదారులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడం, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం గడిచిన 22 నెలలుగా కనీసం పనులను ప్రారంభించే చొరవ తీసుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రెండు జాతీయ పార్టీల నడుమ ఈ ప్రాజెక్టు ముందుకు సాగక ప్రయాణికులకు ముప్పతిప్పలకు గురి చేస్తున్నది. తాజాగా ఈ ప్రాజెక్టుపై రెండు జాతీయ పార్టీల వైఖరి చర్చనీయాంశంగా మారింది.
చెప్పేదొకటి.. చేసేదొకటి
ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర సర్కారు చెప్పేదొకటి..చేసేదొకటిగా వ్యవహరిస్తున్నది. క్షేత్రస్థాయిలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పనులు దక్కించుకున్న గాయత్రి ప్రాజెక్ట్ జాప్యానికి గల కారణమని అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి గడ్కరీని కలిసి ఈ ప్రాజెక్టు నుంచి గాయత్రిని తొలగించాలని, ఆలస్యానికి కారణమైన సదరు కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత ఆర్ అండ్ బీ, జీహెచ్ఎంసీ అధికారులతో మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి కొత్త ఏజెన్సీని ఖరారు చేసి దసరా నాటికల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. పరిస్థితిని చూస్తే వచ్చే దసరా వరకైనా అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు.. ఇందుకు కారణం లేక పోలేదు..గత మే నెలలో హైదరాబాద్ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ వచ్చిన సందర్భంగా 10 నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు.
ఐతే సదరు గాయత్రి ప్రాజెక్టుకు పూర్తి మద్దతుగా బీజేపీ నిలబడడం.. కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేయలేని స్థితిలో పరోక్షంగా అండగా నిలుస్తుండడం గమనార్హం. రెండు జాతీయ పార్టీలు గాయత్రికి అండగా నిలబడడంతో సదరు కంపెనీ పనులను నత్తనడకన కొనసాగిస్తూ ప్రయాణికులను ఇబ్బందులు పెడుతుండడం గమనార్హం.
అవస్థలు పడుతున్న జనం..
ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ దుస్థితి. ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన కేంద్రం ఏళ్లకు ఏళ్లు తరబడి ప్రాజెక్టులు చేపడుతూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. ఉప్పల్ రింగు రోడ్డు నుంచి నారాపల్లి వరకు రూ. 626.8కోట్ల వ్యయంతో 6.25 కిలోమీటర్ల మేర ఆకాశమార్గంలో ఆరు వరుసల్లో ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి 2018 మే 5న కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. 7 ఏండ్లు కావచ్చినా 40శాతం మేర కూడా పనులు పూర్తవ్వలేదు.
ఫలితంగా ప్రజలు, ఇటు వాహనదారులు నరకయాతనకు గురవుతున్నారు. మొదట్లో ఆస్తుల సేకరణ పూర్తయితే కానీ, పనులు ప్రారంభించేది లేదని గతంలో స్పష్టం చేసిన ఎన్హెచ్ఏఐ అధికారులు, జీహెచ్ఎంసీ భూసేకరణలో ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని రెండేళ్లలోపే పనులు వేగవంతం చేయడంలో విఫలమయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉప్పల్ – నారపల్లి కారిడార్ పనులు ప్రస్తుత స్పీడుతో కొనసాగితే మరో రెండేళ్లయినా పూర్తయ్యే పరిస్థితి లేదని స్థానికులు చెబుతున్నారు.
ఉదయం, సాయంత్రం వేళల్లో మేడిపల్లి నుంచి ఉప్పల్ రావడానికి ఒకోసారి గంట పడుతోంది. కారిడార్ పూర్తయితే ట్రాఫిక్ ఇబ్బందుల పరిషారం ఏమో కానీ, నిలిచిన నిర్మాణం పనులతో నరక యాతన అనుభవిస్తున్నామని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా నగరం నుంచి వరంగల్ వైపు వెళ్లే వారు ఉప్పల్ రింగు రోడ్డు, బోడుప్పల్, మేడిపల్లి, చెంగిచర్ల చౌరస్తాలలో ట్రాఫిక్ రద్దీతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రాజెక్టు ఉద్దేశం..
ఉప్పల్ జంక్షన్ నుంచి నల్ల చెరువు, పీర్జాదిగూడ కమాన్, బోడుప్పల్ డిపో, మేడిపల్లి, చెంగిచర్ల చౌరస్తా వరకు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. వాహనాలు నిత్యం గంటల తరబడి రోడ్లపై నిలిచి పోతుంటాయి. ఇక వర్షం వచ్చినప్పుడు, ఫంక్షన్లు ఉన్నప్పుడు పరిస్థితి మరింత జఠిలంగా ఘోరంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సైవే నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 163 జాతీయ రహదారిపై 6.25 కిలోమీటర్ల మేర 145 పిల్లర్లతో పనులు ప్రారంభమయ్యాయి. ఇది ఆరు లైన్ల సైవే. 2018 మేలో పనులకు శ్రీకారం చుట్టగా.. 2020 జూన్ వరకు నిర్మాణం పూర్తవుతుందని లక్ష్యంతో అధికారులు పనులు చేపట్టారు.
ఉప్పల్ ఎలక్ట్రికల్ జంక్షన్ నుంచి ప్రారంభమయ్యే ఈ కారిడార్ నారపల్లి సీపీఆర్ఐ వద్ద ముగుస్తుంది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.670 కోట్లు. ఇప్పటికే దాదాపు 52 ఫిల్లర్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. నల్ల చెరువుపై ఆరు పోర్టల్ బీమ్లను నిర్మిస్తున్నట్లు పేరొన్నారు. నారపల్లి వద్ద స్లాబ్ పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. కానీ ఉప్పల్ ప్రాంతంలో పిల్లర్స్ పనులు చేయడంలో ఆలస్యం చేస్తుండడం గమనార్హం. ముఖ్యంగా పనులు పూర్తిచేయడంలో ఆలస్యం కావడంతో రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. వీటితోపాటు, రోడ్డు వేయకపోవడంతో నిత్యం ట్రాఫిక్ స్తంభించిపోతుంది.
ఉప్పల్-నారపల్లి ఫ్లై ఓవర్ విశేషాలు
మార్గం- ఉప్పల్-నారపల్లి (వరంగల్ జాతీయ రహదారి)
పొడవు – 6.25 కి.మీలు వరుసలు -ఆరు
ప్రాజెక్టు అంచనా వ్యయం – రూ. 670 కోట్లు
తేదీ: 5-5-2018న ప్రారంభించిన కేంద్ర మంత్రి గడ్కరీ
పిల్లర్లు 145, వీటిలో సగం కూడా నిర్మాణం కాలేదు