బేగంపేట్, డిసెంబర్ 4: సనత్నగర్ శాసనసభ్యుడిగా మూడోసారి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన తలసాని శ్రీనివాస్యాదవ్కు అభినందనలు వెల్లువెత్తాయి. సోమవారం వెస్ట్ మారేడ్పల్లిలోని ఆయన నివాసానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు బస్తీలు, కాలనీలకు చెందిన ప్రతినిధులు పెద్ద ఎత్తున చేరుకొని ఎమ్మెల్యే తలసానిని శాలువాలు, పూల మాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోనే తాను ఘన విజయం సాధించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సనత్నగర్ నియోజకవర్గం పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘ కాలిక సమస్యలను పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గం ప్రజలకు ఏ అవసరం వచ్చినా తాను నిరంతరం అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సనత్నగర్ కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి, మహేశ్వరి, హేమలతా, మాజీ కార్పొరేటర్ శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.