సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆర్థోపెడిక్ స్టేట్ అసోసియేషన్(టీఓఎస్ఏ) పర్యవేక్షణలో యశోద హాస్పిటల్, హైటెక్సిటీ డివిజన్లో నిర్వహించిన మూడు రోజుల షోల్డర్ అండ్ ఎల్బో 7వ జాతీయ సదస్సు విజయవంతంగా ముగిసింది. స్వదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి దాదాపు 300మంది వైద్యనిపుణులు, పీజీ వైద్య విద్యార్థులు హాజరైన ఈ సదస్సులో భుజం, మోచేతి నొప్పి, వాటికి గల కారణాలు, సమస్యను నిర్ధారించే ఆధునిక వైద్య పద్ధతులు, అందుబాటులోకి వచ్చిన నూతన చికిత్సా విధానాలు తదితర అంశాలపై చర్చించారు.
ప్రధానంగా షోల్డర్ అండ్ ఎల్బో సర్జరీస్, షోల్డర్ అండ్ ఎల్బో నొప్పితో బాధపడుతున్న రోగులకు అవగాహన కల్పించడం, అప్పర్లింబ్ సర్జరీస్పై చర్చించారు. ఇందులో షోల్డర్ మజిల్స్, షోల్డర్ కాంప్లెక్స్, ఫ్రాక్చర్స్, రీప్లేస్మెంట్, ఎల్బో ఫ్రాక్చర్స్, ఎల్బోకు సంబంధించిన సాధారణ గాయాలపై నిర్లక్ష్యం, సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల తీవ్రంగా మారడం, ఎల్బో ఆర్థ్రోస్కోపి, ఎల్బో రీప్లేస్మెంట్ వంటి అంశాలపై కూడా చర్చించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఇలాంటి సదస్సుల వల్ల షోల్డర్ అండ్ ఎల్బో చికిత్స విధానంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య పద్ధతులు, వైద్య పరికరాలు, కొత్త పరిజ్ఞానం, నూతన అధ్యయనాలు తదితర అంశాలను ఇచ్చిపుచ్చుకోవచ్చన్నారు. దీంతో వృత్తిపరంగా వైద్యులకే కాకుండా చికిత్స పరంగా రోగులకు కూడా మేలు జరగనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ చైర్మన్ డా.అడ్ల దీప్తినందన్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.జయ ప్రసాద్, జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.బి.చంద్రశేఖర్, ట్రెజరర్ డా.అమిత్రెడ్డి, విదేశాల నుంచి డా.రాధాకాంత్ పాండె, డా.అమిత్మోది, డా.హర్విందర్సింగ్, డా.అశిష్గుప్తా, డా.అమోల్ తంబె, డా.శంతను, డా.కపిల్కుమార్, తదితరులు పాల్గొన్నారు.