Musi River | సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు కోసం సమగ్ర మాస్టర్ప్లాన్ను రూపొందించనున్నది. ఈ మాస్టర్ప్లాన్లో నది మొత్తం విస్తీర్ణం, దాని పరిసర ప్రభావ ప్రాంతాలను పరిగణలోకి తీసుకోనున్నారు. ఉస్మాన్సాగర్(గండిపేట) జలాశయం దిగువ భాగం నుంచి మొదలై నగరానికి తూర్పు దిక్కున ఉన్న గౌరెల్లి సమీపంలోని ఔటర్ రింగు రోడ్డు సరిహద్దు వరకు, అదేవిధంగా మరో జలాశయమైన హిమాయత్సాగర్ దిగువ ప్రాంతం నుంచి బాపుఘాట్ వద్ద మూసీ, ఈసీ నదుల సంగమం వరకు మొత్తం 59 కి.మీ మేర ఉన్న నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించి అగ్రిగేట్ మాస్టర్ప్లాన్ను రూపొందించనున్నారు. ఇప్పటికే సిమ్యులేషన్ ఫర్ హైడ్రాలిక్స్ పేరుతో రూపొందించే ప్రాజెక్టుకు కన్సల్టెన్సీలను ఎంపిక చేసేందుకు టెండర్ ప్రకటించగా, మరో టెండర్ను మూసీ అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్ కోసం కన్సల్టెన్సీల ఎంపికకు టెండర్లు పిలిచింది. మూసీ నది తీరంలో పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. కొత్తగా రూపొందించే మాస్టర్ ప్లాన్ నది మొత్తం విస్తీర్ణం, దాని పరిసర ప్రభావ ప్రాంతాలను కవర్ చేసేలా ఉంటుందని అధికారులు తెలిపారు. ల్యాండ్ మార్క్ ఆర్కిటెక్చర్, ట్రాన్స్పోర్టేషన్ నోడ్లు, గ్రోత్ జోన్ స్థానాలను గుర్తించడానికి వీలుగా ఈ మాస్టర్ ప్లాన్ ఉపయోగపడనున్నది.
మూసీ పరిరక్షణ కోసం రూపొందించే అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్లో 5 అంశాలకు ప్రాధ్యానిస్తున్నారు. బ్లూ మాస్టర్ ప్లాన్, మార్కెట్ ఫీసబిలిటీ స్టడీ, ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్, ఫైనాన్షియల్ మాస్టర్ ప్లాన్లు ఇందులో ఉంటాయని అధికారులు తెలిపారు. వీటిలో అధిక ప్రాధాన్యతనిస్తున్న బ్లూ మాస్టర్ప్లాన్లో స్థిరమైన నీటి వనరుల వినియోగానికి సమగ్ర నిర్వహణ వ్యూహాలు, నీటి నాణ్యత నిర్వహణ, పర్యావరణ వ్యవస్థ సంరక్షణ, వరద నియంత్రణ, ఉపశమనం, దీర్ఘకాలిక పర్యవేక్షణ వంటివి ఉంటాయి. అదేవిధంగా రవాణా ఆధారిత అభివృద్ధి అంశం (టీవోడీ)పైనా ప్రత్యేకంగా డిజైన్లను కన్సల్టెన్సీలు రూపొందించాల్సి ఉంటుంది. ఇలా ప్రతి అంశానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణను రూపొందించనున్నది.