secunderabad club fire accident : అగ్నిప్రమాదంలో దగ్ధమైన సికింద్రాబాద్ క్లబ్ భవనంలో అగ్గి ఎక్కడ పుట్టింది? ఎలా ప్రమాదం జరిగింది? అనే విషయంపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. అయితే భవనం పూర్తిగా దెబ్బతినడంతో ఎప్పుడైనా కుప్పకూలే అవకాశాలుండడంతో అధికారులు సోమవారం లోపలికి వెళ్లలేదు.ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సికింద్రాబాద్ క్లబ్లో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. క్లబ్ నిర్వాహకులు అగ్నిప్రమాద నివారణకు సంబంధించిన ఎలాంటి పరికరాలు అమర్చలేదని అగ్నిమాపక శాఖ దర్యాప్తులో తేలింది. ప్రతినిత్యం వందలాదిగా ఇక్కడకు వచ్చిపోతుంటారు.. అలాంటిది ప్రమాద నివారణకు ముందస్తు ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలి. క్లబ్ నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలను కూడా తుంగలో తొక్కారని ప్రభుత్వ శాఖలు గుర్తించాయి. అగ్నిప్రమాదానికి గల కారణాన్ని విశ్లేషించేందుకు ఇంకా సమయం పట్టే అవకాశాలున్నాయి.
మంటలు వేగంగా వ్యాపించి..
భవనం లోపల కలప ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి భవనం పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో లోపలికి ఎవరు పోవద్దని అగ్నిమాపక శాఖ సూచనలు చేసింది. ఇక మారేడ్పల్లి పోలీసులు ఘటనపై పంచనామా పూర్తి చేశారు. ప్రమాదానికి కారణాలు కనుక్కునేందుకు లోపలికి తప్పనిసరిగా పోలీసులు వెళ్లాల్సి ఉండడంతో, అగ్నిమాపక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వేచిచూస్తున్నారు. సోమవారం క్లూస్టీమ్ ఘటనా స్థలికి వెళ్లినా, భవనంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆధారాలు సేకరించలేదని తెలిసింది.
తమకు అగ్నిమాపక శాఖ నుంచి క్లియరెన్స్ రాగానే దర్యాప్తు జరుపుతామని నార్త్జోన్ డీసీపీ చందనాదీప్తి తెలిపారు. ఇదిలా ఉండగా క్లబ్ నిర్వహణలో లోపాలున్నాయని, నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని అగ్నిమాపక శాఖ రీజినల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య స్పష్టం చేశారు.
కలప.. మద్యం క్లబ్ లోపల ఇంటీరియర్లో కలపను ఎక్కువగా వాడారు. మరో వైపు మద్యం బాటిళ్లను కూడా నిల్వ చేశారు. మంటలు ఇంటీరియర్ వస్తువులకు అంటుకోగా, మద్యం కూడా తోడవ్వడంతో భారీగా అగ్ని కిలలు ఎగిసిపడ్డాయి. అగ్నికి ఆహుతైన మద్యం విలువ సుమారు రూ. 3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు ఉండే అవకాశాలున్నాయని తెలిసింది. ఎక్సైజ్ పోలీసులు కూడా మద్యం ఎంత మేరకు నిల్వ ఉంది.. ఎంత నష్టం జరిగిందనే విషయాలపై వివరాలు సేకరించారు.
ఆ క్లబ్లలో తనిఖీలు
బంజారాహిల్స్: సికింద్రాబాద్ క్లబ్లో భారీ అగ్నిప్రమాదం జరిగిన నేపథ్యంలో జూబ్లీహిల్స్లోని క్లబ్లలో అగ్నిమాపక శాఖ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఫైర్ స్టేషన్ అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఫిలింనగర్ కల్చరల్ సెంటర్, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్, జింఖానా క్లబ్లలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు.
కీలక ఆధారాలు సేకరణ..
సికింద్రాబాద్ క్లబ్ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో నార్త్ జోన్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే క్లూస్ టీమ్ అధికారులు పలు కీలక ఆధారాలను సేకరించారు. 50 వేల చదరపు అడుగుల స్థలంలో టేకు ఇంటీరియర్తో పాటు విలువైన మద్యం, నగిషీలు, ప్రాచీన అరుదైన ఫర్నిచర్ కాల్నైట్ బార్ బంగ్లా కిచెన్, మిలిటరీ అధికారుల కార్యాలయాలు అగ్నికి ఆహుతైనట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం ఉదయమే క్లబ్లో పనిచేసే సిబ్బందిని మొదటగా విచారించారు. వారి నుంచి పలు కీలకమైన సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు క్లబ్ అధ్యక్షుడు రఘురాంరెడ్డి నేతృత్వంలో పలువురు సభ్యులు సమావేశమయ్యారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన పలు అంశాలను చర్చించినట్లు సమాచారం.
తాత్కాలికంగా మూసివేత
సికింద్రాబాద్ క్లబ్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు క్లబ్ యాజమాన్యం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు క్లబ్ మూసివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.