మేడ్చల్, జనవరి7 (నమస్తే తెలంగాణ): భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో 536 చెరువులు ఉన్నాయి. చెరువుల అన్యాక్రాంతం, కబ్జాలకు గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన సర్వే ఇటీవలే పూర్తయింది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో చెరువుల హద్దులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించిన మేడ్చల్ జిల్లా అధికారులు పూర్తి వివరాల నివేదికను హెచ్ఎండీఏ ఉన్నతాధికారులకు సమర్పించారు. చెరువుల భూములు కబ్జాకు గురై అన్యాక్రాంతం కాకుండా నివారించే చర్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. చెరువుల పరిరక్షణకు చేసిన సర్వే వివరాలను హెచ్ఎండీఎ అధికారులు ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. దీంతో ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు రాకుండా చెక్ పెట్టేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
చెరువులు కబ్జా చేసిన వారికి నోటీసులు..!
చెరువు భూములను కబ్జా చేసిన వారికి రెవెన్యూ అధికారులు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నారు. చెరువుల హద్దులు, సర్వే ప్రకారం కబ్జాకు గురైన వాటిని గుర్తించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు కలిసి సమన్వయంతో క్షేత్ర స్థాయిలో పర్యటించి కబ్జాలను గుర్తించే పనిలో ఉన్నారు. చెరువులు కబ్జాకు గురైతే, కబ్జాలు చేసిన వారిని గుర్తించి నోటీసులు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు. గతంలో కూడా కబ్జాలు చేసిన వారికి నోటీసులు జారీ చేశారు. స్పందించని వారిపై కేసులను నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.