సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ వెస్ట్ కారిడార్లో మరో వంతెన రాబోతున్నది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్తో పాటు నగరంలోని కోర్ ఏరియాలోనూ ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ (ఎస్ఆర్డీపీ) ప్రోగ్రాం చేపట్టింది. ఇందులో భాగంగా 47 ఎస్ఆర్డీపీ ప్రాజెక్టుల్లో 33 అందుబాటులోకి రాగా, 17 వంతెనలు కూడా ఉన్నాయి. తాజాగా న్యూ ఇయర్ కానుకగా 18వ ఫ్లై ఓవర్ కొత్తగూడలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నది. రూ. 263.09 కోట్లతో మూడు కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ వంతెన 98శాతం పనులు పూర్తి చేసుకొని తుది మెరుగులు దిద్దుకుంటున్నది. ఈ నెల 25 వరకు ఈ ఫ్లై ఓవర్ పనులను వంద శాతం పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచుతామని అధికారులు తెలిపారు. కాగా షేక్పేట ఫ్లై ఓవర్ను ఈ ఏడాది జనవరి 1న ప్రారంభించినట్లుగానే రాబోయే జనవరి 1న కొత్తగూడ ఫ్లై ఓవర్ను ప్రారంభించి వాహనదారులకు ప్రభుత్వం గిఫ్ట్గా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్లకు ఇరువైపులా భారీ కమర్షియల్ భవనాలు ఉన్నాయి. పరిసర ప్రాంతాల్లో అనేక సాఫ్ట్వేర్ సంస్థలు ఉన్నాయి. ఈ జంక్షన్లలో రద్దీ సమయాల్లో భారీ ట్రాఫిక్ అవుతున్నది. గచ్చిబౌలి నుంచి మియాపూర్ వరకు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్సిటీ ప్రాంతం మధ్య ప్రధాన కనెక్టివిటీ రహదారి ఏర్పడుతుంది. ఈ ఫ్లై ఓవర్ రాకతో బొటానికల్ గార్డెన్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్లలో వంద శాతం ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. కొండాపూర్ జంక్షన్లో 65 శాతం మేర ట్రాఫిక్కు విముక్తి లభిస్తుంది.