బంజారాహిల్స్, నవంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలో పోటీచేయవద్దని నిర్ణయం తీసుకున్న సందర్భంగా గత నెల 29న బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన సమావేశం సందర్భంగా తెలుగు తమ్ముళ్ల మధ్య చోటు చేసుకున్న గొడవలపై వచ్చిన ఫిర్యాదులతో బంజారాహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 29న టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిర్వహించిన టీడీపీ ముఖ్యనాయకుల సమావేశంలో చంద్రబాబుకు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయిన నాయకులు బాహాబాహీకి దిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కాసాని జ్ఞానేశ్వర్తో పాటు నాయకులు భిక్షపతి ముదిరాజ్, ప్రకాశ్ ముదిరాజ్, రవీంద్రా చారి తదితరులు తనపై దాడి చేశారంటూ గోషామహల్కు చెందిన టీటీడీపీ నేత డా.ఏఎస్.రావు మంగళవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, తదితరులపై ఐపీసీ 323, 290, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, పార్టీ నుంచి సస్పెండ్ అయిన డా.ఏఎస్.రావు సమావేశంలోకి వచ్చి పార్టీ జాతీయ కమిటీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించడంతో పాటు తమపై దాడికి పాల్పడ్డాడని పేర్కొంటూ గోషామహల్ టీడీపీ ఇన్చార్జి ప్రశాంత్ యాదవ్ మరో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు డా.ఏఎస్.రావు, తదితరులపై ఐపీసీ 323, 290, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.