మియాపూర్/ జగద్గిరిగుట్ట, జనవరి16 : ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసం చేసిన సంఘటన ఎల్లమ్మబండలో జరిగింది. జగద్గిరిగుట్ట సీఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మబండ రహదారిపై ఉన్న జయశంకర్ విగ్రహాన్ని మంగళవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తి ధ్వంసం చేస్తుండగా స్థానికులు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకునేలోపే విగ్రహాన్ని కిందపడేసిన వ్యక్తి పగులగొడుతూ కనిపించాడు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఎల్లమ్మబండ సమీపంలోని మహవీర్నగర్కు చెందిన గోవిందు(35) గా తేలింది.
నిందితుడు కొంతకాలంగా మతిస్థిమితంలేక ప్రవర్తిస్తున్నట్లు వెళ్లడైంది. దీంతో నిందితుడిని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి పంపి కేసునమోదు చేశారు. విషయం తెలుసుకున్న ఆల్విన్కాలనీ కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎల్లమ్మబండలో ధర్నాకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆదే ప్రాంతంలో విగ్రహాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నెలరోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటన జరగడం అత్యంత దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. దుండగుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
దుండగుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి: కేటీఆర్
ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనకు బాధ్యుడైన దుండగుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు డిమాండ్ చేశారు. సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని మంగళవారం ఎక్స్ వేదికపై ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసుల ముందే విగ్రహాన్ని దుండగుడు ధ్వంసం చేశారని, దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని డీజీపీని కేటీఆర్ కోరారు. తెలంగాణ సమాజమంతా ఎంతగానో గౌరవించుకునే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ధ్వంసం చేయడం అత్యంత హీనమైన చర్య అంటూ దాడిని తీవ్రంగా ఖండించారు.