సిటీబ్యూరో, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగర ఇమేజ్ను మరింత పెంచే దిశలో ప్రభుత్వం చేపడుతున్న సరికొత్త విధానాలు మంచి సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఒకప్పుడు అపరిశుభ్రతకు ప్రధాన కారణమైన భవన నిర్మాణాల వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి రీయూజ్ (పునర్ వినియోగం)లోకి తీసుకువచ్చేందుకు నగరం నలువైపులా సీఅండ్డీ (కన్స్ట్రక్చన్స్ అండ్ డీమాలిషన్) ప్లాంట్ను నెలకొల్పి స్వచ్ఛ హైదరాబాద్ దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే మరో అడుగు ముందుకు వేశారు. అక్కడక్కడ భవన నిర్మాణ వ్యర్థాలు వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భవన నిర్మాణ, కూల్చివేసిన వ్యర్థాలను రోడ్డు, ఫుట్ పాత్, నాలాలు, చెరువులు అనుమతి లేని ప్రదేశాల్లో వేస్తున్నారని, ఆయా ప్రదేశాలలో వేయకుండా ప్రతి జోన్కు రెండు చొప్పున టెంపరరీ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ప్రకటించారు. భవన నిర్మాణ వ్యర్థాలను సీఅండ్డీ ప్లాంట్కు తీసుకొని వెళ్లేందుకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో కమిషనర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. స్టాండింగ్ కమిటీ సమావేశంలో 10 అంశాలకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు.
వార్డుకు 3వేల గణపతులు
భవన నిర్మాణ వ్యర్థాలు అనుమతి లేని ప్రదేశాల్లో వేయకుండా కార్పొరేటర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. మట్టి వినాయక విగ్రహాల పంపిణీలో కార్పొరేటర్లు భాగస్వాములు కావాలని సూచించారు. వినాయక చవితి సందర్భంగా మట్టితో తయారు చేసిన విగ్రహాలు జీహెచ్ఎంసీ ద్వారా 3.10 లక్షలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా 90 వేలు మొత్తం 4 లక్షల విగ్రహాలు పంపిణీ చేయనున్నట్లు కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. వార్డుకు 2800 నుంచి 3 వేల విగ్రహాలు వార్డు కార్యాలయం నుంచి పంపిణీ చేస్తామన్నారు. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభించనున్నట్లు కమిషనర్ వివరించారు. ఈ సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు శాంతి సాయిజెన్ శేఖర్, సయ్యద్ మిన్హాజుద్దీన్, సయ్యద్ సోహెల్ ఖాద్రీ, సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్, మహ్మద్ అబ్దుల్ ముక్తర్, మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, వనం సంగీత యాదవ్, సతీష్బాబు పండాల, ఆర్.సునీత, టి.మహేశ్వరి, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, ఈఎన్సీ జియా ఉద్దీన్, హౌసింగ్ ఓఎస్డీ సురేశ్ కుమార్, అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరీష్, యాదగిరి రావు, చంద్రకాంత్ రెడ్డి, జయరాజ్ కెనడి, విజయలక్ష్మి, గీతా రాధిక, ఉపేందర్ రెడ్డి, సీసీపీ రాజేంద్రప్రసాద్ నాయక్, సీఈ దేవానంద్, చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్లు, ఎస్ఎన్డీపీ సీఈ కిషన్, చీఫ్ ఎంటమాలజీ డా.రాంబాబు, జోనల్ కమిషనర్లు వెంకటేశ్ దోంత్రె, రవి కిరణ్, పంకజ, శ్రీనివాస్ రెడ్డి, మమత, వెంకన్న, సెక్రటరీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్టాండింగ్ కమిటీ సభ్యులు లేవనెత్తిన సమస్యలు త్వరితగతిన పరిషరించాలని అధికారులను ఆదేశించారు.
స్టాండింగ్ కమిటీ సమావేశంలోఆమోదించిన కీలక అంశాలు..