సిటీబ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ ): ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన ప్రకటనలపై ముందస్తుగా జిల్లా ఎన్నికల అధికారి అనుమతి పొందాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, ఆడియో, వీడియో డిస్ప్లే, సినిమా థియేటర్లు, రేడియో చానల్, బల్క్ ఎస్ఎంఎస్, వెబ్సైట్లలో ప్రసారం చేసే వీడియో ప్రకటనలతో పాటు వాల్ రైటింగ్ డిస్ప్లే, వాహనాలకు అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. వార్త పత్రికలు, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల్లో వచ్చే పెయిడ్ న్యూస్ గుర్తింపునకు ప్రత్యేకంగా మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ (ఎంసీ, ఎంసీ)ని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సీపీఆర్వో సెక్షన్లో ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. జిల్లా ఎన్నికల అధికారి చైర్మన్గా ఉన్న ఈ కమిటీలో ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్, సీనియర్ జర్నలిస్టు, జీహెచ్ఎంసీ సీపీర్వోలు, హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ను నియమించినట్లు రోనాల్డ్ రాస్ తెలిపారు.
ఎన్నికల సందర్భంగా మీడియా అతిక్రమణలు జరిగితే ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని రోనాల్డ్ రాస్ తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా, శాటిలైట్ చానల్స్, లోకల్ కేబుల్ నెట్వర్క్స్లో ప్రసారమయ్యే అన్ని రకాల రాజకీయ ప్రకటనలను ఎంసీ, ఎంసీ కమిటీ ద్వారా ముందస్తుగా అనుమతి పొందాలని, అదే విధంగా పోలింగ్ రోజు, ముందు రోజు ప్రచురితం అయ్యే ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో ప్రకటనలను కూడా అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి రాజకీయ ప్రకటనలకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు కూడా అనుమతి తీసుకోవాలని చెప్పారు. పోస్టర్లు, కరపత్రాలు కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిధిలోనే ఉండాలన్నారు. హైదరాబాద్ జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులకు మాత్రమే హైదరాబాద్ జిల్లా ఎంసీ ఎంసీ కమిటీ ద్వారా రాజకీయ ప్రకటనలకు అనుమతి జారీ చేస్తామని స్పష్టం చేశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రిజిస్ట్రార్ అయిన రాజకీయ పార్టీలు రాజకీయ ప్రకటనలకు సంబంధించి రాష్ట్ర స్థాయి ఎంసీ ఎంసీ కమిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని రోనాల్డ్ రాస్ స్పష్టం చేశారు.
ఏదైనా పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా చానల్స్లో వచ్చే వార్తలు, సోషల్ మీడియా విశ్లేషణలకు డబ్బులు చెల్లించడం లేదా ప్రలోభాలు.. తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని పెయిడ్ న్యూస్గా ఎంసీఎంసీ కమిటీ గుర్తిస్తుంది. క్షేత్ర స్థాయిలో ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్న పెయిడ్ న్యూస్లను అరికట్టడానికి ప్రత్యేకంగా పెయిడ్ న్యూస్ నియంత్రణ వ్యవస్థను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ మీడియా మానిటరింగ్, సర్టిఫికేషన్ కమిటీ ఈ పెయిడ్ న్యూస్లను గుర్తించి రిటర్నింగ్ అధికారుల ద్వారా సంబంధిత అభ్యర్థికి నోటీసులు జారీ చేస్తుంది. పెయిడ్ న్యూస్కు సంబంధించి సమాచార శాఖ అందించిన రేట్ కార్డును అనుసరించి వాటికి అయ్యే వ్యయాన్ని లెకించి అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో జమ చేయడానికి ఆర్వో ద్వారా నోటీసులు జారీ చేస్తారు. ఈ నోటీసు ప్రతిని ఎన్నికల వ్యయ పరిశీలకులకు అందజేస్తారు. పత్రికలు, టీవీ చానల్స్లో ప్రసారమైన పెయిడ్ న్యూస్ వ్యయాన్ని తమ ఎన్నికల వ్యయంలో ఎందుకు కలపరాదో కోరుతూ.. 96 గంటల్లోగా సంబంధిత అభ్యర్థికి రిటర్నింగ్ అధికారి నోటీసులు జారీ చేస్తారు. పెయిడ్ న్యూస్పై రిటర్నింగ్ అధికారి జారీ చేసిన నోటీసులకు సంబంధిత అభ్యర్థులు 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థుల సమాధానానికి ఎంసీ ఎంసీ కమిటీ సంతృప్తి చెందనట్లయితే ఆ వ్యయాన్ని అభ్యర్థుల ఎన్నికల వ్యయంలోకి కలుపుతారు.
వివిధ చానళ్లలో వచ్చే వార్తలను రికార్డింగ్ చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజక వర్గాలకు సంబంధించి అభ్యర్థులు, పార్టీలు నిర్వహించే ప్రచారాలకు సంబంధించి చానళ్ల రికార్డింగ్ను చేపట్టామని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటి నుంచి పెయిడ్ న్యూస్, ప్రకటనలకు సంబంధించి వ్యయాన్ని, అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలుపనున్నట్టు వెల్లడించారు.