సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఆస్తిపన్ను వసూళ్లపై మరింత వేగం పెంచాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. నిర్ధేశిత లక్ష్యాల అమలులో నిర్లక్ష్యం తగదని, వీక్లీ టార్గెట్స్ కాకుండా డైలీ టార్గెట్గా పెట్టుకుని ఆస్తిపన్ను వసూళ్లను రాబట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు నెలల పాటు వసూళ్లలో వేగం మందగించిందన్నారు. దీంతో 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆరు జోన్ల పరిధిలో రూ.2100కోట్ల టార్గెట్లో దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూలు అయ్యాయి. ఆర్థిక సంవత్సరం ఈ నాలుగు నెలల పాటు రూ.900 కోట్ల మేర లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండడంతో ఆస్తిపన్ను వసూళ్లపై ప్రధాన దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఆస్తిపన్ను వసూళ్లలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు.
ఈ నెలలోనే ఆరు జోన్లకుగానూ సుమారు రూ.240కోట్ల టార్గెట్ పెట్టుకుని రంగంలోకి దిగితే.. రెండు వారాలు గడిచినా ఇప్పటి వరకు రూ.15కోట్లు కూడా దాటలేకపోవడం పట్ల కమిషనర్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా ఫైనాన్స్, రెవెన్యూ విభాగాలకు చెందిన అదనపు కమిషనర్లు, కమిషనర్లు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్లపై విస్తృత తనిఖీలు చేపట్టేవారు. దీంతో పాటు ఎక్కువ ట్యాక్స్ కలెక్షన్ చేసే బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లకు ఇన్సెంటివ్స్ ఇచ్చే వారు. కానీ ఈ సంప్రదాయానికి తెరదించడంతోనే పన్ను వసూళ్లు సరిగా లేవన్న కారణాలుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బకాయిదారులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులకు స్పందించకుంటే సంబంధిత షాపులను సీజ్ చేయడం లాంటి చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.