సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా సవరణపై కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు నేడు (శని), రేపు (ఆదివారం) అన్ని జోనల్, సర్కిల్ కార్యాలయాలు, వార్డు ఆఫీసుల వద్ద ప్రత్యేక ఓటరు శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ఓటరు నమోదు, సవరణ దరఖాస్తులను బూత్ లెవెల్ పోలింగ్ అధికారులు స్వీకరించనున్నారు.
ఈ నెల 6న విడుదలైన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులను తెలిపే గడువు ఈ నెల 22తో ముగియనుందని చెప్పారు. నూతన ఓటరు నమోదుతోపాటు, డబుల్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లను తొలగించి ఫిబ్రవరి 8న తుది జాబితాను ప్రకటిస్తారని అధికారులు తెలిపారు.