కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 16 : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. సోమవారం కూకట్పల్లి జోన్ ఆఫీస్లో వానకాలంలో దోమల వృద్ధి, సీజనల్ వ్యాధులపై ఎంటమాలజీ, ట్రాన్స్పోర్టు విభాగం అధికారులతో జడ్సీ మమత సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వానకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై దృష్టిసారించాలని డెంగీ, ఇతర విషజ్వరాలు ప్రబలిన ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. దోమల వృద్ధిని లార్వా దశలోనే అరికట్టాలని కాలనీలు, బస్తీల్లో అపరిశుభ్ర ప్రాంతాలను గుర్తించి రసాయనాలను పిచికారీ చేయాలన్నారు. ఐదు సర్కిళ్లలోని ప్రధాన చెరువుల్లో చేపట్టిన గుర్రపుడెక్క తొలగింపు పనులను వేగవంతం చేయాలన్నారు. ఎంటమాలజీ సిబ్బంది ఇంటింటికీ తిరిగి దోమలు వృద్ధి చెందే అవకాశాలనలు ప్రజలకు వివరించాలని, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చెరువుల్లో లార్వాను నియంత్రించేందుకు డ్రోన్ సహాయంతో రసాయనాలను పిచికారీ చేయాలన్నారు. అవసరమైన చోట ఆయిల్బాల్స్, గంబూసియా చేపలను వదులుతూ లార్వా దశలోనే దోమలను అంతం చేయాలన్నారు. ఎంటమాలజీ సీనియర్ అసిస్టెంట్ వై.లచ్చిరెడ్డి, సీటీవో గోవర్ధన్ గౌడ్, ఏఎంసీ శ్రీకాంత్ రెడ్డి, ఐదు సర్కిళ్లకు చెందిన ఎంటమాలజీ, ట్రాన్స్పోర్టు ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.