ఉస్మానియా యూనివర్సిటీ, మే 5: ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలోని వివిధ విభాగాలలో వేరువేరు పేర్లతో జాతీయ స్థాయి టెక్నికల్ ఫెస్టివల్స్ (సింపోజియం) ప్రారంభమయ్యాయి. ఈ సింపోజియంలో భాగంగా విద్యార్థులు పలు విభాగాలలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు శుక్రవారం ప్రారంభమై రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ పోటీల్లో విద్యార్థులకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీంతో యూనివర్సిటీ సందడిగా మారింది. ఈ సింపోజియంలను అధ్యాపకులతో సంబంధం లేకుండా ఆయా విభాగాల విద్యార్థులే నిర్వహించారు. అధ్యాపకులు కేవలం సలహాదారులుగా వ్యవహరిస్తారని విద్యార్థులు వివరించారు. విద్యార్థుల అభిప్రాయాలు, పరిశోధనల అనుభవాలను ఒక వేదికపై తీసుకువచ్చేందుకు ఈ సింపోజియంలు ఎంతో ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు. టీమ్ వర్క్, ప్రణాళిక, నిధుల సేకరణ తదితర అంశాలను విద్యార్థి దశలోనే నేర్చుకోవచ్చని చెబుతున్నారు.
సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు నిర్మాణ్ పేరుతో సింపోజియం ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రతిభను వెలికితీసారు. విద్యార్థులు రూపొందించిన నూతన తెలంగాణ సచివాలయ నమూనాను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. కెనాల్ లాక్ గేట్లు, స్లోప్ స్టెబిలిటీ, షేక్ టేబుల్, స్మార్ట్ పార్కింగ్, ట్రాఫిక్ క్రాసింగ్స్, హైబ్రిడ్ ఫౌండేషన్, కాలమ్ డిఫెక్ట్స్ తదితర నమూనాలను ప్రదర్శించి తమ ప్రతిభ, సృజనాత్మకతను తెలియజేశారు. పేపర్ ప్రజెంటేషన్, టెక్నో జనరల్ క్విజ్, క్యాడ్మానియా, ట్రెజర్హంట్, సేజ్ ఆన్ స్టేజ్ తదితర అంశాలలో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రోడ్డు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రాధా టీఎంటీ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ అక్షత్ సరాఫ్, ఆర్ఈ సస్టెయినబిలిటీ ప్రాజెక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఈశ్వర్, హెడ్ ప్రొఫెసర్ రాజశేఖర్, స్టూడెంట్ అడ్వైజర్ ప్రొఫెసర్ రూపేశ్కుమార్, స్టూడెంట్ కన్వీనర్లు సంజయ్, రాహుల్, మసియుద్దీన్, గంగోత్రి, షణ్ముఖ్, వినయ్ తదితరులు హాజరయ్యారు.
ఎలక్ట్రానిక్ విద్యార్థులు నిర్వహిస్తున్న సింపోజియం ‘ఆకృతి’లో భాగంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో భాగంగా టెలిఫోన్, క్యాలిక్యులేటర్, అనలాగ్ కంప్యూటర్, కెమెరా, టీవీ, టైప్రైటర్, రేడియో తదితర వస్తువుల మొదటి తరం నమూనాలను ప్రదర్శించారు. ‘ఎడ్యుకేట్ ఇండియా’ అనే థీమ్తో ఈ సింపోజియంను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, బిజినెస్ క్విజ్, ప్రోగ్రామింగ్ క్విజ్, రొబోటిక్స్, టెక్నాలజీ క్విజ్, షార్ట్ ఫిల్మ్ మేకింగ్ తదితర అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సింపోజియం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా డీఆర్డీవో ఆర్సీఐ ఎఫ్వోఎస్డీ విభాగం హెడ్ గోపాల్నాయక్ హాజరై మాట్లాడుతూ ఆకృతి అర్థాన్ని గురించి వివరించారు. అస్థిపంజరానికి రక్తం, మాంసం కలిస్తేనే ఒక రూపం, జీవం వస్తుందని చెప్పారు. అదేవిధంగా విద్యార్థులు అన్ని విధాలుగా జ్ఞానం సంపాదించుకున్నప్పుడే సంపూర్ణమైన మనిషిగా రూపాంతరం చెందుతారని అభిప్రాయపడ్డారు. ఓటములను తట్టుకుని, లక్ష్యాన్ని మనసులో పెట్టుకుని కష్టపడితే గమ్యాన్ని చేరుకోవచ్చని అన్నారు. మనదేశ జెండా రెపరెపలాడాలని, ఇది విద్యార్థుల చేతిలోనే ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్, ఫ్యాకల్టీ అడ్వైజర్ ప్రొఫెసర్ రామకృష్ణ, ప్రొఫెసర్ రాజేందర్నాయక్, స్టూడెంట్ కన్వీనర్ రుత్విక్ రెడ్డి, ట్రెజరర్ అభిచందన్ తదితరులు పాల్గొన్నారు.
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు టెక్సోనెన్స్ 2023 పేరుతో సింపోజియం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ రకాల పేర్లతో పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, నాన్ టెక్నాలజీ క్విజ్, టెక్నాలజీ క్విజ్, లైవ్ ప్రాజెక్టులు, షార్ట్ ఫిల్మ్, మేకింగ్ ఆఫ్ సర్క్యుట్, కల్చరల్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ టెక్సోనెన్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా టీఎస్ ట్రాన్స్కో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ డైరెక్టర్ జె. సూర్యప్రకాశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సోలార్ పాలసీని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో ప్రత్యేక లక్ష్యంతో ముందుకు పోతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఓయూ యూజీసీ డీన్ ప్రొఫెసర్ మల్లేశం, బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సతీశ్కుమార్, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, హెడ్ ప్రొఫెసర్ విద్యాసాగర్, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ మంగు, డాక్టర్ లోకేందర్ రెడ్డి, విద్యార్థి కన్వీనర్లు వివేక్, అక్షయ, కులసం, నరేశ్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు మెకరీనా పేరుతో సింపోజియం నిర్వహిస్తున్నారు. రోబొటిక్స్, పేపర్ ప్రజెంటేషన్, క్విజ్, లైవ్ ప్రాజెక్టులు, ైస్పాట్ ఈవెంట్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. వర్సిటీ ల్యాబ్లో ఉన్న అధునాతన యంత్రాలను విద్యార్థుల చూసేందుకు వీలుగా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ మెకరీనా 2023 ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ బిజినెస్ హెడ్ సౌరభ్ ఖురానా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో సృజనాత్మకత చాలా ముఖ్యమని అన్నారు. నూతన ఆవిష్కరణలు చేసేటపుడు పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. విభాగంలో వస్తున్న నూతన ఒరవడులను తెలుసుకునేందుకు ఇలాంటి సింపోజియంలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ చంద్రశేఖర్రెడ్డి, ఫ్యాకల్టీ అడ్వైజర్ ప్రొఫెసర్ సరస్వతమ్మ, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ ఉదయ్కిరణ్, ప్రొఫెసర్ ఉమామహేశ్వర్, ప్రొఫెసర్ కృష్ణయ్య, ప్రొఫెసర్ ఉషాశ్రీ, ప్రొఫెసర్ మధుసూదన్రాజు, ప్రొఫెసర్ శివరామకృష్ణ, స్టూడెంట్ కన్వీనర్ నిసార్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇన్ఫినిటీ పేరుతో విద్యార్థులు సింపోజియం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు టెక్నాలజీ ఈవెంట్, పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, మూవీ క్విజ్, స్పాట్ ఈవెంట్స్, పన్నెండు గంటల కంప్యూటర్ కోడింగ్ పోటీ తదితర పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఆర్డీవో ఆర్సీఐ డైరెక్టరేట్ ఆఫ్ రియల్ టైం ఎంబెడ్డెడ్ సాఫ్ట్వేర్ డిప్యూటీ టెక్నాలజీ డైరెక్టర్ ఎన్కే సింగ్, హెడ్ ప్రొఫెసర్ శ్యామల, ప్రొఫెసర్ వెంకట్దాస్, ఫ్యాకల్టీ కన్వీనర్ డాక్టర్ గోవర్ధన్రావు, స్టూడెంట్ కన్వీనర్ రంజిత్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బయోమెడికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు మెడిటెక్ 2023 పేరుతో సింపోజియం నిర్వహిస్తున్నారు. ఈ సింపోజియం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ కొండా విశ్వేశర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్ విభాగాలలో బయోమెడికల్ విభాగం చాలా కీలకమని అన్నారు. ఇంజినీరింగ్ అప్లికేషన్స్ను వైద్యరంగంలో అమలు చేయడమే బయోమెడికల్ విభాగమని చెప్పారు. ఒక పారిశ్రామికవేత్తగా బయోమెడికల్ ఇంజినీర్ల ప్రాముఖ్యత తనకు తెలుసని పేర్కొన్నారు. బయోమెడికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు ఉద్యోగం చేయడం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకోవాలని సూచించారు. సింపోజియంలో భాగంగా నిపుణులచే అతిథి ఉపన్యాసాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు పేపర్ ప్రజెంటేషన్, క్విజ్, స్పాట్ ఈవెంట్స్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. అధునాతన వైద్య పరికరాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఫిజియాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ రాంరెడ్డి, విభాగం హెడ్ డాక్టర్ సుమన్రెడ్డి, కోఆర్డినేటర్ డాక్టర్ విద్యాసాగర్, విద్యార్థి కన్వీనర్లు పాల్గొన్నారు.
మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో ఇగ్నైట్ పేరుతో విద్యార్థులు సింపోజియం నిర్వహించారు. ఈ విభాగాన్ని వర్సిటీలో పునఃప్రారంభించి రెండేళ్లు గడిచింది. విభాగంలో తొలిసారిగా ఈ సింపోజియాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సింగరేణి కాలరీస్ లిమిటెడ్ డైరెక్టర్ (రిటైర్డ్) చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనింగ్ విభాగంలో అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. సింపోజియంలో భాగంగా మైన్స్ క్విజ్, మైన్ మోడల్ ప్రజెంటేషన్, డిబేట్, వర్క్షాప్స్, మైన్ ఎన్విరాన్మెంటల్ ఎక్విప్మెంట్ ప్రజెంటేషన్ తదితర అంశాల్లో పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, జియాలజీ విభాగం మాజీ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, ఫ్యాకల్టీ అడ్వైజర్ ఎం. సతీశ్కుమార్, స్టూడెంట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, కన్వీనర్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.