సిటీబ్యూరో, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ): ముచ్చింతల్ శ్రీరామనగరంలో రామానుజచార్యుల సహస్రాబ్ది, సమతామూర్తి విగ్రహావిష్కరణ వేడుకల సందర్భంగా సైబరాబాద్ పోలీసులు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. బందోబస్తు, భద్రతను మొత్తం పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పర్యవేక్షిస్తున్నారు. 11 అంశాలతో కూడిన వ్యూహాత్మక భద్రతను (అనాలిటికల్ సెక్యూరిటీ) కల్పిస్తున్నారు. ఎక్కడ కూడా అవంతరాలు ఏర్పడకుండా అణువణువూ డేగ కండ్లు పెట్టారు. పటిష్టమైన సమాచార వ్యవస్థను సిద్ధం చేసుకున్నారు. శ్రీరామనగరంలోకి వచ్చే ప్రతి ఒక్కరిని లెక్కించే విధంగా.. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కమాండ్ కంట్రోల్ నుంచే అన్ని శాఖల అధికారులు తమ సిబ్బంది పనితీరును సమీక్షించుకునేలా స్క్రీన్లను నెలకొల్పారు.
అనుక్షణం..
ముచ్చింతల్ పరిసరాల చుట్టూ.. అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, ఇతర రాష్ర్టాల సీఎంలు, వీవీఐపీల రాక సందర్భంగా ఎలాంటి అవంతరాలు ఏర్పడకుండా టెక్నాలజీతో కూడిన సెక్యూరిటీని అందుబాటులోకి తెచ్చారు. ప్రధాన మంత్రి పర్యటన ఖరారు కావడంతో ఎస్పీజీ అధికారులు ఇప్పటికే సైబరాబాద్ పోలీసు అధికారులతో పలు దఫాలుగా భద్రతపై చర్చలు జరిపారు. ఓ ఎస్పీజీ బృందం శ్రీరామనగరానికి చేరుకుంది.
20 స్క్రీన్లతో..
వ్యూహాత్మక భద్రతను సమీక్షించుకునేందుకు శ్రీరామనగరంలో 20 స్క్రీన్లతో కూడిన కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేశారు. మూడు షిఫ్టులలో మొత్తం 70 మంది అధికారులు పనిచేస్తున్నారు. 270 సీసీ కెమెరాలను అనుసంధానం చేశారు. పరిసరాల ప్రాంతాల్లో దాదాపు 5821 మందితో బందోబస్తు పెట్టారు. ఏదైనా సమాచారం ఉన్నా…పోలీసుల అవసరం కావాలన్నా 7901114100 లేదా 9490617444కు సమాచారం అందించాలని ఉన్నతాధికారులు సూచించారు.
11 అంశాలతో వ్యూహాత్మక భద్రత ఇలా..
పోలీసులు, వాతావరణ శాఖ అధికారులతో కలిసి ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రోజుతో పాటు గంటల్లో మారే వాతావరణం సమాచారం అప్డేట్ వచ్చేలా.. పరికరాలను బిగించారు. వాతావరణం మారితే ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేయాలనే అంశాలను కూడా రూపొందించుకున్నారు.
శ్రీరామనగరం చుట్టూ.. పరిసర ప్రాంతాల్లోని దాదాపు 3 కిలోమీటర్ల పరిధిలో రోడ్లపై ఉండే ట్రాఫిక్ మూవ్మెంట్పై నిరంతరం దృష్టి పెడుతున్నారు.
శ్రీరామనగరంలోకి అడుగు పెట్టే ప్రతి ఒక్కరినీ లెక్కించే విధంగా పోలీసులు ప్రత్యేక పరికరాలను నెలకొల్పారు. వీటిని ప్రతి ఎగ్జిట్, ఎంట్రీల వద్ద ఉంచారు. దీంతో రోజు వారీగా వేడుకలకు వస్తున్న వారి లెక్క తెలియనుంది.
మొబైల్ పెట్రోలింగ్ టీంలను సిద్ధంగా పెట్టారు. ఏదైనా అవసరం ఏర్పడితే సెకన్లలో స్పాట్కు చేరేలా పాయింట్లను తయారు చేశారు. వీటి వద్ద పెట్రోలింగ్ మొబైల్ వ్యాన్లను సిద్ధంగా ఉంచారు.
మౌంటెడ్ కెమెరాలతో కూడిన పెట్రోలింగ్ వ్యవస్థతో పాటు డాష్ బోర్డు కెమెరాలను కూడా అమర్చారు. సీసీ కెమెరాలు లేని ప్రాంతంలో వీటిని తిప్పుతున్నారు.
బందోబస్తులో ఉన్న వాహనాలకు జీపీఎస్లను అమర్చారు. దీంతో ఏ వాహనం ఎక్కడో ఉందో అధికారులకు తెలిసిపోతుంది. అవసరం ఏర్పడినప్పుడు వాటికి దగ్గర వాహనాలను పంపేందుకు ఈ జీపీఎస్ వ్యవస్థ ఉపయోగపడుతుంది.
3డీ మ్యాప్ను సైతం సిద్ధంగా ఉంచారు. దీని ద్వారా శ్రీరామనగరం ప్రతి అణువూ స్పష్టంగా చూడొచ్చు. అధికారులు అవసరం ఉన్న లొకేషన్ను యధావిధిగా 3 డీ మ్యాప్ ద్వారా వీక్షించవచ్చు.
అన్ని శాఖల అధికారులు ఒకే దగ్గర కూర్చొని… వారి అవసరాలు, పని తీరుకు సంబంధించిన విషయాలను సమన్వయం చేసుకోవచ్చు.
ఒకవేళ మొబైల్ ఫోన్ల సిగ్నళ్లు అందకపోతే.. ఇబ్బందులు రాకుండా ఆధునిక కమ్యూనికేషన్ సెట్లను సమకూర్చుకున్నారు. దీని వల్ల ఏ సమయంలోనైనా అధికారులకు, సిబ్బందికి సమాచారం అందడంలో అంతరాయం ఏర్పడదు.
సోషల్ మీడియా పోస్టుల పై నిరంతరం నిఘా పెట్టారు. ఈ వేడుకలకు సంబంధించి ఎలాంటి పోస్టులు వస్తున్నాయి…వీడియోలు ప్రసారమవుతున్నాయనే విషయాలను నిరంతరం వీక్షిస్తున్నారు. ఎవరైనా తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరిస్తే ఆ పోస్టులను పెట్టిన వారిని గుర్తించే టెక్నాలజీ పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచారు.
అన్ని న్యూస్ చానళ్ల ప్రసారాలను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. అప్రమత్తం కావాల్సిన అవసరాలను తెలుసుకుంటున్నారు.