ప్రభుత్వ లక్ష్యాలను నిర్ధారిత సమయంలో పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ శ్వేతా మహంతి ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు వైద్యాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కాన్ఫరెన్స్లో కలెక్టర్ శ్వేతా మహంతి పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పథకాల లక్ష్యాలను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులకు కలెక్టర్ పలు సలహాలు, సూచనలు చేశారు. పల్లెప్రగతి, ధరణి, హరితహారం, వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కొవిడ్ కట్టడికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించాలని, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేడు వైద్యశాఖాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధికారులు పాల్గొన్నారు.