నిధుల దుర్వినియోగం చేసింనందుకు ఉత్తర్వులు
ఒకటో వార్డు సభ్యుడు కందాడి శ్రీకాంత్రెడ్డికి ఇన్చార్జి సర్పంచ్ బాధ్యతలు
కీసర, మార్చి 31: పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసినందుకు రాంపల్లిదాయర సర్పంచ్ గరుగుల ఆండాలు, ఉప సర్పంచ్ గాడి రాములను పదవి నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. కీసర మండలంలోని రాంపల్లిదాయరలో సర్పంచ్, ఉప సర్పంచ్ పంచాయతీ నిధులు రూ.43లక్షల 32వేల 230 లను ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఖర్చు చేశారు. ఇందులో రూ.2లక్షల 65వేల 122 లకు బిల్లులు లేకుండా ఖర్చుచేసి దుర్వినియోగం చేశారని వార్డు సభ్యులు గత సంవత్సరం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. విచారణలో పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసినట్లు తేలడంతో సర్పంచ్ , ఉప సర్పంచ్ను పదవి నుంచి తొలగిస్తూ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 37(1) ప్రకారం జిల్లా కలెక్టర్ హరీశ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.బిల్లులు లేకుండా ఖర్చు చేసిన ప్రభుత్వ నిధులను వారం రోజులలోపు జమచేయాలని వారిని ఆదేశించారు. లేనియెడల రెవెన్యూ రికవరీ చట్టం కింద వారి నుంచి పంచాయతీ నిధులను రాబడుతామని జిల్లా కలెక్టర్ జారీచేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. రాంపల్లిదాయర ఒకటో వార్డు మెంబర్ కందాడి శ్రీకాంత్రెడ్డిని ఇన్చార్జి సర్పంచుగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం పంచాయతీ కార్యదర్శి రంగయ్య శ్రీకాంత్రెడ్డికి ఇన్చార్జి సర్పంచుగా బాధ్యతలు అప్పగించారు.