సిటీబ్యూరో, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): వచ్చే నెల 2న (అక్టోబర్) మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా లంగర్హౌజ్లోని బాపూఘాట్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం గాంధీ జయంతి ఏర్పాట్లపై టూరిజం, రెవెన్యూ, పోలీసు, జీహెచ్ఎంసీ, ఫైర్, విద్యా, సమాచారం జలమండలి, ఆర్ అండ్ బీ, హార్టికల్చర్ వంటి పలు శాఖల అధికారులతో కలిసి బాపూఘాట్ను కలెక్టర్ సందర్శించారు. ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ 2న వచ్చే ప్రముఖులను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ శానిటైజర్, మాస్కులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, గొల్కొండ తహసీల్దారు శైలజ, ఇతర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.