కంటోన్మెంట్, ఆగస్టు 24: వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారానే కరోనాను నియంత్రించవచ్చని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా రెండో రోజు కంటోన్మెంట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీతో పాటు ఇతర శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శర్మన్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీతో పాటు కంటోన్మెంట్ పరిధిలో 100శాతం వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తిచేసే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా కంటోన్మెంట్లోని ఎనిమిది వార్డుల్లో 155 బృందాల ద్వారా ఇంటింటికీ సర్వే చేస్తున్నామని చెప్పారు. ఆరోగ్య శాఖ అధికారులు, ఇతర వైద్య సిబ్బంది చేస్తున్న సర్వేకు సంబంధించి పలు సూచనలు చేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం విజయవంతం కావడానికి అందరూ అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. 4లక్షల జనాభాతో పాటు 8 వార్డులు కలిగి ఉన్న కంటోన్మెంట్ పరిధిలో రెండు రోజుల పాటు 155 టీమ్లతో జరిగిన ఇంటింటి సర్వేలో 5,799 గృహాలను సందర్శించామని జిల్లా వైద్యాధికారి వెంకటి తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన 14,770 మందిని గుర్తించామని, అందులో 4,085 మందికి టీకాలు వేయాలని పేర్కొన్నారు. టీకాలు వేసుకోని వారికి బుధవారం నుంచి టీకాలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో డీఐఓ వైద్యులు శ్రీకళతో పాటు ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.