మేడ్చల్, మార్చి 16(నమస్తే తెలంగాణ): ఎన్నికల నిబంధనలను పకడ్బందీంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ నోడల్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్రమంలో శనివారం వివిధ విభాగాల నోడల్ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్, ప్రైవేట్ స్థలాల్లో ఉన్న పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, అడ్వర్జయిజ్మెంట్, కటౌట్స్ను తొలగించాలన్నారు. జిల్లాలోని కంట్రోల్రూమ్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని, అలాగే సి విజిల్ యాప్ ఫిర్యాదులను వంద నిమిషాల్లో పరిష్కరించాలని సూచించారు. ఎంసీసీ బృందాలు క్షేత్రస్థాయిలో నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కలెక్టర్ వెల్లడించారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమం తిరిగి యథావిధిగా నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని మేడ్చల్ కలెక్టర్ కోరారు.