సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) :ప్రాధాన్యత క్రమంలో రుణాలు ఇవ్వడంతో పాటు, నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకునే విధంగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ముద్ర, పీఎంఈజీ, పీఎం స్వనిధి వంటి రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు లక్ష్యాలను చేరుకోవాలన్నారు. బ్యాంకు అధికారులు నామినేట్ చేసిన అధికారులు డీసీసీ సమావేశాలకు పూర్తి వివరాలతో హాజరు కావాలని, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయాలని అన్నారు. ఈ సమావేశానికి హాజరైన ప్రతి బ్యాంకు అధికారిని వారికి కేటాయించిన లక్ష్యాన్ని ఎంత వరకు సాధించారో అడిగి తెలుసుకున్నారు. అలాగే తక్కువ లక్ష్యాలు సాధించిన వారు కూడా త్వరలోనే పురోగతి సాధించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా రుణాలు పొంది, యూనిట్లు ప్రారంభించడానికి ముందుకురాని వారిని గుర్తించి.. వారిని పథకం నుంచి రద్దు చేయాలని జిల్లా పరిశ్రమల శాఖ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. బ్యాంకులో డిపాజిట్లు ఉండి, వాటిని ఉపయోగించని వాటిని తక్షణమే తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. అయితే వచ్చే నెలలోనే తిరిగి బ్యాంకర్లతో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎల్డీ సుబ్రహ్మాణ్యం, రిజర్వూ బ్యాంకు ప్రతినిధి తాన్యా సంగ్మా, నాబార్డు అధికారి గౌరీశంకర్, తదితరులు పాల్గొన్నారు.