సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : రాబోయే పార్లమెంట్ లోకసభ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరగడంలో సెక్టోరల్ అధికారుల పాత్ర చాలా ముఖ్యమైనదని హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మలక్పేట, కార్వాన్, గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్ ఏఆర్ఓ సెక్టార్ అధికారులకు నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు. ప్రతి సెక్టోరల్ ఆఫీసర్ తనకు కేటాయించిన 10-12 పోలింగ్ స్టేషన్లను సందర్శించి పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు సక్రమంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు.
ప్రతి పోలింగ్ స్టేషన్ను సందర్శించి పోలింగ్ కేంద్రాల్లో వసతులపై మంగళవారం సాయంత్రం కల్లా నిర్ధిష్టమైన నివేదిక సమర్పించాలని సెక్టోరల్ అధికారులకు సూచించారు. పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు సమర్పించే నివేదికలను సంబంధిత అన్నేగ్జర్లో పంపాలని సూచించారు. సెక్టోరల్ అధికారులకు మెజిస్ట్రియల్ పవర్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. మాక్పోల్ విషయంలో జాగ్రత్త వహించాలని మాక్పోల్కు సంబంధించిన షీట్స్ను బాక్స్లో నుంచి తీసివేసేలా చూడాలని అన్నారు. కంట్రోల్ యూనిట్ను సీల్ చేయాలని, పనిచేయని బీయూసీయూ,వీవీ ప్యాడ్స్ వాటి స్థానంలో వెంటనే రీప్లేస్ చేయాలని, అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్ఓ వెంకటచారి, ఏఆర్ఓలు, సెక్టోరల్ అధికారులు, ఎలక్షన్స్ సూపరింటెండెంట్ జహురుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.