మేడ్చల్ కలెక్టరేట్, ఆగస్టు 16 : ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రచారం నిర్వహిస్తామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర జాయింట్ ఎన్నికల ప్రధాన అధికారి సర్ఫరాజ్ అహ్మద్ రాష్ట్రస్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికలపై జిల్లా ఎన్నికల అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నూతన ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో లింగ నిష్పత్తి, జనాభా ఓటర్ల నిష్పత్తి తదితర అంశాలపై సర్ఫరాజ్ అహ్మద్ జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ అమోయ్కుమార్ మాట్లాడుతూ.. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజల్లోకి ఎన్నికల కమిషన్ సందేశం, ఓటరు ప్రాముఖ్యతపై విస్తృత ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. పట్టణ ప్రాంతాల్లో సామాజిక మాధ్యామాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రచారం నిర్వహించాలని చెప్పారు.
జిల్లాలో ఉన్న విద్యా సంస్థల్లో ప్రత్యేక ఎలక్టోరల్ క్లబ్లు ఏర్పాటు చేయాలని, ఓటరు ప్రాముఖ్యతపై ప్రచారం కల్పించాలని, 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి, ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 2వ విడత ఓటరు జాబితా సవరణలో భాగంగా డ్రాప్ట్ ఓటరు జాబితా విడుదల కంటే ముందే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని, రెండో ఓటరు సవరణ షెడ్యూల్పై సమాచారం అందించాలని, ఆగస్టు 21న విడుదల చేస్తామని, సెప్టెంబర్ 19వ తేదీలోపు అభ్యంతరాలు, నూతన ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, ఎన్నికల సూపరింటెండెంట్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఈనెల 19వ తేదీన ఉదయం ఓటరు ప్రాముఖ్యతను వివరిస్తూ ‘ఐ ఓట్ ఫర్ ష్యూర్’ అనే నివాదం ప్రచారం కల్పిస్తూ ‘5 కే రన్’ నిర్వహించాలని, దీని కోసం ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ అన్నారు. సమీప ప్రాంతాల యువత ఈరన్ లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.