సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ): ‘హరీశ్ అన్న సేవా సమితి’ పేరుతో అక్రమ పద్ధతిలో వసూళ్లకు దిగిన ఇద్దరు యువకుల ప్లాన్ను టాస్క్ఫోర్స్ నార్త్ జోన్ పోలీసులు భగ్నం చేశారు. వారిద్దరిని అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్రావు కథనం ప్రకారం.. దుండిగల్ మున్సిపాలిటీ బహదూర్పల్లిలోని గాయిత్రి అపార్టుమెంట్లో నివాసముండే పేరాల వెంకటేశ్ అలియాస్ తెలంగాణ వెంకటేశ్వరరావు వ్యాపారి. అతడు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు వద్దకు తరచూ వెళ్తుంటాడు. దీంతో మంత్రి అతడిని గుర్తు పడుతాడు. మంత్రి వద్దకు వచ్చే రాజకీయ నాయకులు, వ్యాపారులు, సామాజిక కార్యకర్తలు, సామాన్య ప్రజలతో అతడు మాట్లాడుతూ.. తాను మంత్రికి బాగా కావాల్సిన వాడినట్టు బిల్డప్ ఇస్తూ అందరితో పరిచయం పెంచుకున్నాడు. దీంతో మంత్రి వద్దకు వచ్చే చాలా మంది వెంకటేశ్ను గుర్తు పడుతారు. దీనిని ఆసరాగా చేసుకున్న వెంకటేశ్ వసూళ్ల దందాకు తెరలేపాడు. హరీశ్ అన్న సేవా సమితి పేరుతో చందా పుస్తకాలు ప్రింట్ చేయించి, అందరి వద్ద నుంచి భారీగా వసూళ్లు చేయాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా ‘హరీశ్ అన్న సేవా సమితి’ పేరుతో చందా పుస్తకాలు ప్రింట్ చేయించాడు.
ఆ బుక్స్పై రిజిస్ట్రేషన్ నంబర్ 1963/2016.. (నకిలీ) పేర్కొంటూ వివేకానంద కాలనీ, కూకట్పల్లి చిరునామాలో ఉన్నట్టు చూపించాడు. ఈ చందా బుక్స్ను షాపూర్లోని లక్ష్మి ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేయించాడు. ఈ సమితికి అధ్యక్షుడిగా ఏమాత్రం సంబంధం లేని గుండాల మల్లేశ్ గౌడ్ పేరును, ఉపాధ్యక్షుడిగా పేరాల వెంకటేశ్, ప్రధాన కార్యదర్శిగా బౌరంపేటకు చెందిన గడ్డమీది రాజేశ్ కుమార్ పేర్లను, వారి ఫోన్ నంబర్లను ముద్రించాడు. మొదటి పది పేజీల్లో హరీశ్రావుతోపాటు ఇతర మంత్రులు రూ.10 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు చందాలు ఇచ్చినట్లు రశీదులు రాసిపెట్టారు. తెలిసిన వారు, వ్యాపారులు, బిల్డర్ల వద్దకు వెళ్లి మంత్రులు తమవంతు సహకారం అందించారని, మీరు కూడా సహకరించాలంటూ సంప్రదించడం మొదలు పెట్టారు. వెంకటేశ్, రాజేశ్ కుమార్ అక్రమంగా డబ్బులు సంపాదించేందుకు హరీశ్ అన్న సేవా సమితి అనే పేరును వాడుకుంటున్నట్లు నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్రెడ్డి బృందానికి విశ్వసనీయంగా సమాచారం అందడంతో పంజాగుట్ట పోలీసులతో కలిసి నిందితులిద్దరని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఒక రశీదు పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు.