ఆన్లైన్ ద్వారా ఆర్డర్, విక్రయం
ఆఫ్రికన్ దేశస్తుడితో పాటు నగరానికి చెందిన ఇద్దరు అరెస్టు
56 గ్రాముల కొకైన్ స్వాధీనం
సుల్తాన్బజార్, మే 24 : ఆన్లైన్లో ఆర్డర్ తీసుకొని, బ్రూ కాఫీ ప్యాకెట్లలో కొకైన్ నింపి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను ధూల్పేట్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి, వారి నుంచి 56 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ శాఖ హైదరాబాద్ సూపరింటెండెంట్ విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆఫ్రికాకు చెందిన మోరెస్ స్టూడెంట్ వీసాపై ఇండియాకు వచ్చి నగరంలోని సన్సిటీలో నివాసముంటున్నాడు. నగరానికి చెందిన సందీప్తో పరిచయం పెంచుకుని కొకైన్ విక్రయించి సులభంగా డబ్బులు సంపాదించాలని పథకం వేశారు. మోరెస్కు ఉన్న పరిచయాలతో ఢిల్లీ నుంచి కొకైన్ను నగరానికి తీసుకువచ్చి ఎవరికి అనుమానం రాకుండా బ్రూ కాఫీ ప్యాకెట్లలో ప్యాక్ చేసి ఆన్లైన్ ద్వారా ఆర్డర్ తీసుకుని విక్రయాలకు పాల్పడుతున్నారు.
పురానాపూల్ వద్ద కొకైన్ డెలివరీ చేస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు అక్కడికి చేరుకుని మోరెస్, సందీప్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఏడు గ్రాముల కొకైన్, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మోరెస్ ఇంట్లో సోదాలు జరుపగా 38 గ్రాములు, కారులో 11 గ్రాముల కొకైన్ లభ్యమైంది. అయితే కొకైన్ విక్రయానికి చార్మినార్ ప్రాంతంలోని ఓ మాసాలా కంపెనీకి చెందిన యజ్ఞానంద్ కారును ఉపయోగిస్తున్నారు. యజ్ఞానంద్ పరారీలో ఉండగా డ్రైవర్ లియాఖాన్ను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉన్నది.