సికింద్రాబాద్ : సీఎం సహాయనిధి పేదల వైద్యానికి భరోసానిస్తోందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి అన్నారు. పేదల వైద్యానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తూ అండగా నిలుస్తోందన్నారు.
బుధవారం న్యూబోయిన్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో న్యూ బోయిన్పల్లి ధనలక్ష్మి కాలనీకి చెందిన యాదుళ్ల హుస్సేన్ అనే వ్యక్తి వైద్యం కోసం రూ.60వేల విలువ చేసే ఎల్వోసీని వారి కుటుంబసభ్యులకు జక్కుల మహేశ్వర్రెడ్డి అందజేశారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో హుస్సేన్ నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దీంతో వైద్య ఖర్చుల నిమిత్తం బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డిని సంప్రదించగా, స్పందించిన జక్కుల విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డి సిఫారసుతో సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేయించారు.
అనంతరం సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.60వేల విలువ గల ఎల్వోసీని బాధిత కుటుంబసభ్యులకు జక్కుల అందజేశారు. ఈ సందర్భంగా జక్కుల మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుపేదల వైద్యానికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.