కంటోన్మెంట్, ఏప్రిల్ 8: ఇంత కాలం కాంగ్రెస్ పార్టీ విజయానికి మోగిన మాదిగ డప్పు, ఇంక ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ పతనానికే మోగుతుందని ఎమార్పీఎస్ మండిపడుతోంది. మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని, పార్లమెంట్తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో మాదిగలకు స్థానం లేకుండా చేసిందని ఎమ్మార్పీఎస్ కంటోన్మెంట్ ఇన్చార్జి ఇటుక శ్రీకిషన్ మాదిగ మండిపడ్డారు. పికెట్ చౌరస్తాలో సోమవారం కంటోన్మెంట్ ఎమ్మార్పీఎస్ నాయకులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఇటుక శ్రీకిషన్ మాదిగ మాట్లాడుతూ, 17 పార్లమెంట్ స్థానాల్లో నాలుగు శాతం కూడా లేని రెడ్లలకు ఆరు సీట్లు, 50 శాతానికిపైగా ఉన్న బీసీలకు రెండు స్థానాలు కేటాయించి, 12 శాతానికి పైగా ఉన్న మాదిగలకు మాత్రం స్థానమే లేకుండా చేసిందని విమర్శించారు. అదే విధంగా 45 ఏండ్లుగా కంటోన్మెంట్లో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఈ సారి వచ్చిన ఉప ఎన్నికలో సైతం మాదిగలకు టికెట్ కేటాయించలేదని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కాదని, రెడ్ల, మాలల సర్కారు అని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా ఎక్కువగా ఉందని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో మాదిగలే ఎక్కువ ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు. మాదిగలకు రావాల్సిన వాటాను కక్ష పూరితంగా అడ్డుకుంటూ సీఎం రేవంత్రెడ్డి వివక్షత చూపుతున్నారని మండిపడ్డారు. రేవంత్రెడ్డి మాదిగలను అంటరాని వారిగా భావిస్తున్నారని దుయ్యబట్టారు. మాదిగల సహకారంతో నేడు ఈ స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డి, మాదిగల పట్ల వివక్షత చూపుతూ ఉంటే మాదిగ జాతి చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
కాంగ్రెస్ విజయానికి డప్పు కొట్టిన తమ మాదిగ జాతి, మీ పతనానికి డప్పు కొడుతుందని, ఈ అవమానాలు తమకేమీ కొత్తకాదని, కానీ కాంగ్రెస్ను అధికారం నుంచి దింపే వరకు తమ ఆత్మ గౌరవ ఉద్యమ పోరాటం ఆగదన్నారు. రేవంత్ రెడ్డి విలువల్లేని, విధానాలు లేని రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి రాజకీయాలు ఎల్లకాలం చెల్లవని, లోక్సభతో పాటు కంటోన్మెంట్లో జరుగుతున్న ఉప ఎన్నికలో గుణపాఠం తప్పదన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు అజిత్ కళ్యాణ్, రొట్టెల సునీల్ మాదిగ, కొంపల్లి శ్రీకాంత్ మాదిగతో పాటు తదితరులు పాల్గొన్నారు.