మెట్రో రైలు రెండో దశ విస్తరణ పనులకు ఈనెల 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్ అలీ, సబితాఇంద్రారెడ్డి కలిసి భూమి పూజ చేయనున్న మైండ్ స్పేస్ జంక్షన్, బహిరంగ సభ జరిగే తెలంగాణ పోలీసు గ్రౌండ్స్ను గురువారం పరిశీలించి.. వివిధ అంశాలపై చర్చించారు. వారి వెంట ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ, మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఉన్నారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ)/బండ్లగూడ/కొండాపూర్ : గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 9న రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టు పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో గురువారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, తదితరులు మైండ్ స్పేస్ జంక్షన్, రాజేంద్రనగర్లోని తెలంగాణ పోలీసు గ్రౌండ్స్ ప్రాంతాల్లో పర్యటించారు. శంకుస్థాపన చేయనున్న మైండ్ స్పేస్ జంక్షన్లో శిలాఫలకం పైలాన్ ఏర్పాటు చేయాల్సిన ప్రాంతం, ట్రాఫిక్ మళ్లింపు అంశాలపై అధికారులతో సమీక్షించారు. అదేవిధంగా బహిరంగ సభ నిర్వహించే పోలీసు గ్రౌండ్స్లో సభా వేదిక ఏర్పాటు, సభకు వచ్చే ప్రజల వాహనాల పారింగ్ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఎయిర్ పోర్టు నుంచి ఐటీ కారిడార్లోని రాయదుర్గం మైండ్ స్పేస్, హైటెక్ సిటీకి కేవలం 20 నిమిషాల్లో చేరుకొనే అవకాశం ఉంటుందని మంత్రి తలసాని చెప్పారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ గమ్య స్థానాలకు చేరుకోవాలనే ఆలోచన, ట్రాఫిక్ సమస్యను పరిషరించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం వందల కోట్ల వ్యయంతో నూతనంగా అండర్ పాస్లు, ఫ్లై ఓవర్లు నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. మొదటి దశలో 2017 నవంబర్ 29న నగరంలో మెట్రో రైలు సేవలను నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. మూడు కారిడార్లలో కలిపి 69 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలు అందుతున్నాయని పేరొన్నారు. అత్యధిక సంఖ్యలో ప్రజలు మెట్రో రైలులో ప్రయాణం చేసి ఎంతో ఆదరించారని తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారు 31 కోట్ల మంది వరకు మెట్రో రైలులో ప్రయాణం చేశారని మంత్రి తలసాని వివరించారు. రెండో దశతో కలుపుకొని మొత్తం 100 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. మంత్రుల వెంట ఎంపీ రంజిత్ రెడ్డి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, అరికె పూడి గాంధీ, కాలే యాదయ్య, కలెక్టర్ అమోయ్ కుమార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ రఘునందన్ రావు, ట్రాఫిక్ ఏసీపీ హన్మంతరావు, తదితరులు ఉన్నారు.
రూ.6,250 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ పనులకు సీఎం కేసీఆర్ మైండ్ స్పేస్ జంక్షన్ లో శంకుస్థాపన చేసిన అనంతరం పోలీసు గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం ఉన్న రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మేర నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ రైలు లైన్ నిర్మాణంలో బయో డైవర్సిటీ జంక్షన్, నానక్ రాంగూడ, నార్సింగి, టీఎస్ పోలీస్ అకాడమీ, రాజేంద్రనగర్, శంషాబాద్, ఎయిర్ పోర్టు, తదితర ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు చేస్తారని అన్నా రు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో విమాన ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా మారుతుందని తెలిపారు.