“తెలంగాణలో దారులన్నీ పూల తేరులైపోయినయి అని కవి అద్భుతంగా రాశారు. దారులు పూల రథాలుగా మారి.. పచ్చని చెట్లు స్వాగతం చెబుతున్నాయి.. తెలంగాణ వీధులన్నీ ఎర్రటి, పసుపు పచ్చని పూలతో అందంగా ఉన్నాయని చెప్పడమంటే.. ఇదంతా ఒట్టిగ జరిగేది కాదు. ఇంతకు ముందున్న సర్పంచులకు హరిత కీర్తి దక్కలేదు. గ్రామాలను పచ్చగ చేసిన కీర్తి ఇప్పుడున్న సర్పంచులకే దక్కింది..ఎంత ఆస్తి ఉన్నా.. ఎంత పెరిగినా పచ్చదనం లేకపోతే వాతావరణం అనుకూలంగా లేకపోతే ఏం చేయలేం.. బతకడానికి అనుకూలమైన పర్యావరణ పరిస్థితులను నిర్మించడం కూడా మన తరం బాధ్యత. హరితహారంతో ఎన్నో అద్భుతాలు జరిగాయి”. అని సీఎం కేసీఆర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం తుమ్మలూరులో నిర్వహించిన హరితోత్సవంలో పాల్గొన్న ఆయన.. అర్బన్ ఫారెస్ట్ పార్కులో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాపై వరాల జల్లు కురిపించారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మొక్కలు నాటేందుకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరుకు వచ్చిన సీఎం కేసీఆర్ వరాల జల్లులు కురిపించారు. ముందుకు తుమ్మలూరు వద్ద ఉన్న అర్బన్ ఫారెస్ట్ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మ్యాక్ ప్రాజెక్టు పక్కనే ఉన్న మైదానంలో జరిగిన హరితోత్సవ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. అంతకుముందే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభివృద్ధి పనులకు సంబంధించి సీఎంకు పలు విజ్ఞప్తులు చేశారు. దీనికి స్పందించిన సీఎం..ఇంటి ఆడబిడ్డగా సబితా ఇంద్రారెడ్డి అడిగినవన్నీ ఇవ్సాల్సిందేనని పేర్కొంటూ..అదనంగా మరిన్ని హామీలు, వరాలు ఇచ్చారు.
త్వరలోనే ఈ ప్రాంతానికి పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరందిస్తామని, మెట్రో రైలును మహేశ్వరం వరకు విస్తరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్ కాలేజిని మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. తుమ్మలూరులో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం..దశాబ్ది ఉత్సవాలకు గుర్తుగా ఆ కమ్యూనిటీ హాల్కు ‘దశాబ్ది కమ్యూనిటీ హల్’ పేరు పెట్టాల్సిందిగా సూచించారు. తుమ్మలూరులో విల్లాలు విస్తారంగా ఏర్పాటు అవుతున్నందున కరెంటు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సబ్ స్టేషన్ను మంజూరు చేస్తున్నట్లు సభా వేదికగా ప్రకటించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని 65 గ్రామపంచాయతీలకు రూ.15 లక్షల చొప్పున స్పెషల్ ఫండ్ నిమిత్తం వెంటనే మంజూరు చేస్తూ జీవో జారీ చేస్తామన్నారు. వీటితో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. జల్పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీలకు చెరో రూ.25 కోట్లను, బడంగ్ పేట్, మీర్పేట కార్పోరేషన్లకు రూ.50 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
– రంగారెడ్డి, జూన్ 19(నమస్తే తెలంగాణ)
హరితోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సీఎం కేసీఆర్కు జనహారతి పట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు అశేష జనవాహిని తరలివచ్చింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో రావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. ఎటూ చూసినా గులాబీ జెండాలు, సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలే దర్శనమిచ్చాయి. సభా ప్రాంగణలలోనూ కేసీఆర్, కేటీఆర్ ప్లకార్డ్స్ను పార్టీ శ్రేణులు ప్రదర్శించారు. నలువైపులా కిలోమీటర్ల మేర రహదారులపై జనం కనిపించారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే అని సీఎం కేసీఆర్ పేర్కొనడంతో సభా ప్రాంగణం కరతాళ ధ్వనులు, ఈలలతో ప్రతిధ్వనించింది. ఈ సందర్భంగా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది. నాలుగు చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు సైతం ఎప్పటికప్పుడు భద్రతా చర్యలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ఐఎఫ్ఎస్ రాకేశ్దోబ్రియల్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ఎఫ్వో సుధాకర్రెడ్డి, కలెక్టర్ హరీశ్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్, ఎంపీ రంజిత్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి, ఆర్డీవో సూరజ్కుమార్, రైతు బంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు మంచి రెడ్డి కిషన్రెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్యాదవ్, కాలె యాదయ్య, సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశ్, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, తుమ్ములూరు సర్పంచ్ మద్ది సురేఖ కరుణాకర్రెడ్డి, ఉప సర్పంచ్ కటికెల శ్రీహరి, మాజీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, రత్నం, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునితా ఆంధ్యానాయక్, కందుకూరు జడ్పీటీసీ జంగారెడ్డి, మీర్పేట్ మేయర్ దుర్గ దీప్లాల్ హాన్, తుకుగూడ మున్సిపాలిటీ కమిషనర్ వెంకట్రామ్, వైస్ చైర్మన్ భవానీ వెంకట్రెడ్డి, ఎంపీడీవో నర్సింలు, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు హనుమగల్ల చంద్రయ్య, నియోజకవర్గ కార్యదర్శి గుండెమోని అంజయ్య ముదిరాజ్ , మారెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి నాయకుడు కూన యాదయ్య, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 18వ రోజున నిర్వహించిన ‘తెలంగాణ హరితోత్సవం’ లో సోమవారం సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ప్రగతి భవన్ నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటలకు తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్ పార్కు వద్దకు చేరుకున్నారు. అక్కడ పాఠశాల, కళాశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన కేసీఆర్ కొద్దిసేపు రిజర్వ్ ఫారెస్టులో పర్యటించారు. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో ప్రయాణించి అటవీ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ది పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. మొక్కల సంరక్షణకు సంబంధించిన అంశాలను మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ డోబ్రియాల్లు సీఎం కేసీఆర్కు వివరించారు. వన్యమృగాలు, అడవి జంతువుల నుంచి స్వీయ రక్షణ, పంటల రక్షణలో భాగంగా వినియోగించే ఆయుధాలు, రక్షణ వ్యవస్థలకు సంబంధించిన ఫొటో ప్రదర్శనలను సీఎం తిలకించారు. అనంతరం అక్కడే మహాగని రకానికి చెందిన మొక్కను మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం నాటారు.