‘కులం, మతం, జాతి, వర్గం అనే వివక్ష లేకుండా అన్ని పండుగలను ఘనంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ‘జై తెలంగాణ’ నినాదంతో తెలంగాణను సాధించి ఒక అభ్యుదయ పథంలో నిలబెట్టగలిగాం.. ఈ రోజు జై భారత్ నినాదంతో మనందరం పురోగమించి అద్భుత భారతావని నిర్మించుకుందాం. అందుకోసం మీ ఆశీస్సులు.. మీ అండదండలు.. కావాలని కోరుతున్నా’ అని బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు.
బుధవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్చేసి క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ స్ఫూర్తితో దేశం పురోగమించాలని ఆకాంక్షించారు. జాతి వివక్షలేని భారతావని కోసం అందరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్రైస్తవ మతపెద్దలతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో త్వరలోనే సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.