భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నూటికి నూరుపాళ్లు ఆచరిస్తున్న నేల తెలంగాణ అని యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్దేవ్ థోరట్ కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనా విధానాలే దేశానికి అన్ని విధాలా శ్రేయస్కరమని భావించటం వల్లే తెలంగాణ ప్రభుత్వం ఆ మహనీయుడికి 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నిర్మించిందన్నారు. మంగళవారం హైదరాబాద్లోని రవీంద్ర భారత్లో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్,సమతా సైనిక్ దళ్, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఫోరమ్ సంయుక్తంగా ‘అంబేదర్ మహా విగ్రహ స్థాపన ధన్యవాద సభ’ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహా విగ్రహ స్థాపన, తెలంగాణ సచివాలయానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంపై దేశంలోని మేధావులు హర్షం వ్యక్తం చేశారు.
– హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ)
ఆధునిక భారతదేశ నిర్మాత, భారత రాజ్యాంగ ప్రదాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహా విగ్రహాన్ని ఈ దేశం నడిబొడ్డున(హైదరాబాద్ దేశానికి నాభి వంటిది) హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠించడం ఈ దేశ ప్రజలందరికీ గర్వకారణం. తెలంగాణ ప్రభుత్వం నగరం మధ్యలో బుద్ధుని ఆవరణలోనే 125 అడుగుల అంబేద్కర్ మహోన్నత విగ్రహాన్ని స్థాపించడం చరిత్రాత్మకం. తెలంగాణ రాష్ట్ర ప్రధాన నిర్ణయాల పరిపాలనా సౌధం, ప్రధాన అధికారిక సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంగా నామకరణం చేయడం మహోన్నత నిర్ణయం. ఈ రెండు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని దేశంలోనే అందరికీ ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలిచిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును ఈ సభ హృదయ పూర్వకంగా అభినందిస్తున్నది. దళితబంధు వంటి సాహసోపేత నిర్ణయాలతో దళితుల అభివృద్ధికి, సామాజిక వికాసానికి అందిస్తున్న స్ఫూర్తికి సీఎం కేసీఆర్కు కృతజ్ఞాతాభి వందనాలు తెలియజేస్తూ సభలో తీర్మానం చేశారు. అందరూ కరతాల ధ్వనులతో ఆమోదం తెలిపారు.
తెలంగాణ సమాజం బాబా సాహెబ్కు కృతజ్ఞతలు తెలిపిన విధానం అద్భుతం. హైదరాబాద్ నడిబొడ్డులో అంబేద్కర్ స్ఫూర్తి చిహ్నాన్ని నిర్మించడానికి కేసీఆర్ అంగీకరించడం గొప్ప విషయం. చిన్న రాష్ర్టాల అవసరం గురించి అంబేద్కర్ వ్యక్త పరిచిన అభిప్రాయం, పెద్ద రాష్ర్టాల్లో మైనార్టీ ప్రజలకు ఉండే ఇబ్బందులను అధిగమించడానికి కేంద్రం తీసుకోవాల్సిన చొరవను అంబేద్కర్ వివరించిన విధానం గొప్పది. హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం ఉండడం అనేది మన హక్కు. దీనిని సాకారం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 25 ఏండ్ల క్రితం ఔరంగాబాద్ వెళితే అక్కడి అంబేద్కర్ విగ్రహాలు ఇనుప పంజరాల్లో ఉన్నాయి. ఎందుకంటే.. అంబేద్కర్ విగ్రహాలపై తరచూ దాడులు జరుగుతూ ఉండేవి. కానీ, తెలంగాణలో మాత్రం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, సచివాలయానికి అంబేద్కర్ పేరు.. ఓ స్ఫూర్తి చిహ్నంగా నిలుస్తాయి.
– కే శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి ఎడిటర్
అంబేద్కర్ కేవలం ఒక విగ్రహం కాదు. ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. మహాత్మా గాంధీ, నెహ్రూ.. ఎలా అందరివాళ్లు అయ్యారో, అలాగే అంబేద్కర్ కూడా అన్ని వర్గాలకు చెందిన వ్యక్తి. అంబేద్కర్ని సమాజంలో అందరికి చెందిన వాడిగా మార్చాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగే అన్ని కార్యక్రమాల్లో అన్ని సామాజిక వర్గాల వారికి తగు ప్రాధాన్యత ఇస్తున్నాం. విద్యార్థుల్లో అంబేద్కర్ విధానాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన భారీ అంబేద్కర్ విగ్రహం.. ప్రపంచంలో తెలంగాణతో పాటు దేశ కీర్తిని మరింత పెంచేందుకు దోహద పడుతుంది. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం ఒక చారిత్రక ఘట్టం. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్టాచ్యూ ఆఫ్ ఇక్వాలిటీలాగే.. అంబేద్కర్ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా గుర్తించాలి.
– ప్రొఫెసర్ కే.సీతారామారావు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ
ఒక గిరిజనుడు పాలమూరు వర్సిటీకి వైస్ చాన్సలర్ అయ్యాడంటే అది సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే సాధ్యమైంది. అంబేద్కర్ చూపిన మార్గంలో కేసీఆర్ ఆలోచించడం వల్లే నేను ఇవాళ వీసీగా ఉన్నాను. బాబా సాహెబ్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లేందుకు కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారు. కేసీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని నేను నా స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి.. మా పిల్లలు ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు కూడా చేయరు. రిజర్వేషన్లను మనలోనే మరొకరికి దక్కే అవకాశం ఉవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది. ఇకనుంచి రిజర్వేషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారు.. తమ కుటుంబంలో మళ్లీ ఆ రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం సాధించకుండా.. అంబేద్కర్ మార్గదర్శనంలో నడవాలని ఆశిస్తున్నాను.
– ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, పాలమూరు యూనివర్సిటీ వీసీ
తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న అంబేద్కర్ బింబం.. ఇప్పుడు 125 అడుగుల మహా విగ్రహంగా రూపుదిద్దుకున్నది. బాబా సాహెబ్ అనేది ఒక పేరుకాదు ప్రభంజనం. ఒక రెవల్యూషన్. బాబా సాహెబ్ మనకొక దారి చూపారు. మనం అందరం అంబేద్కర్ మార్గదర్శనంలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సహాయం చేసేందుకు అవకాశం ఉన్నంత వరకూ కృషి చేయాలి. అలా ఎవరికి తోచిన సహాయం వాళ్లు చేస్తే అణగారిన వర్గాల బతుకుల్లో త్వరగా వెలుగులు నిండుతాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తున్నది. అంబేద్కర్ భావజాలాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నది. ఇది అభినందనీయం.
– ప్రొఫెసర్ విజ్జులత, తెలంగాణ మహిళా యూనివర్సిటీ వీసీ
అంబేద్కర్ దశాబ్దాల క్రితమే తెలంగాణ వంటి ఒక రాష్ట్రం ఏర్పడాలనే ఆవశ్యకతను ఊహించి, దానికి రాజ్యాంగంలో వెసులుబాటు కల్పించడం సంతోషకరం. మెజార్టీ వ్యక్తులు ఏది చెబితే అదే చట్టం అవుతుందని అనేకమంది అనుకుంటున్నారు. ఎంతమంది వ్యతిరేకించినా పార్లమెంట్లో బిల్లు పెట్టడం, పాస్ అవడం అన్నీ.. రాజ్యాంగం వల్లనే సాధ్యమయ్యాయి. అనేక దేశాల్లో రాజ్యాంగాలు మారాయి. కానీ మన దేశంలో మాత్రం రాజ్యాంగంలో చిన్న చిన్న మార్పులు చేశారే తప్ప.. ఎవరూ రాజ్యాంగం జోలికి వెళ్లలేదు. రాజ్యాంగమే లేకపోతే ఇవాళ తెలంగాణ కల సాకారమయ్యేదే కాదు. అందుకు కృతజ్ఞతగా కేసీఆర్… భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం, సచివాలయానికి బాబా సాహెబ్ పేరు పెట్టడం హర్షణీయం. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.
– ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ
హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు హర్షణీయం. జ్ఞానాన్ని ఎంతోమందికి పంచిన మహనీయుడిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. కేసీఆర్ మార్గదర్శనంలో తెలంగాణ యూనివర్సిటీలో 18 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో తెలంగాణలోని అనేక విద్యాసంస్థల్లో, అనేక పల్లెల్లో ప్రజలు స్వచ్ఛందంగా భారీ ఎత్తున బాబాసాహెబ్ విగ్రహాలను నెలకొల్పుకుంటారు. తెలంగాణ యూనివర్సిటీలో అంబేద్కర్ భావజాలాన్ని విద్యార్థులకు నేర్పుతున్నాం. ఫలితంగా ఎంతోమంది విద్యార్థులు స్వచ్ఛందంగా మిగిలిన వారికి సాయం చేస్తున్నారు. రాబోయే కాలంలో తెలంగాణ అంతా అంబేద్కర్ వాదం విస్తరిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
– ప్రొఫెసర్ రవీందర్ గుప్తా, తెలంగాణ యూనివర్సిటీ వీసీ
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. దేశంలో అణగారిన వర్గాల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. దేశంలో ప్రతిఒక్కరూ ఒక్కటే అని చాటిచెప్పిన గొప్ప వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్. ఆయన విజనరీని అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అంబేద్కర్ చూపిన బాటలోనే సీఎం కేసీఆర్ పయనిస్తున్నారు. ఇదెంతో గొప్ప విషయం. అంబేద్కర్ విగ్రహం కోసం, సచివాలయానికి ఆయన పేరు పెట్టాలని ఎవరూ అడగలేదు. ఎటువంటి ఉద్యమాలు చేయలేదు. కానీ.. కేసీఆర్ మాత్రం అంబేద్కర్ భావజాలాన్ని గుర్తించి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అంబేద్కర్ బాటలో నడిచే కేసీఆర్ వెంటే అందరం నడవాల్సిన అవసరం ఉన్నది. దేశాన్ని రక్షించుకోవాలంటే కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరం. ఉద్యమ నేత, బడుగు, బలహీన వర్గాల ఆశాదీపం కేసీఆర్తోనే దేశంలో అంబేద్కర్ పాలన సాధ్యం.
– ఆరేపల్లి రాజేందర్, ఎస్సీ, ఎస్టీ నేషనల్ ఇంటలెక్చువల్ ఫోరం
నూతనంగా ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ అంబేద్కర్ -రమాబాయిల పెళ్లి రోజును పురస్కరించుకొని సోమవారం కేక్ను కట్చేస్తున్న ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు హరికృష్ణ, చంద్రప్రభ, పుష్పవాణి తదితరులు.
దేశానికి ఏం కావాలో వందేండ్ల క్రితమే బాబా సాహెబ్ ఆలోచించారు. దశాబ్దాల తర్వాత ఎటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి? ప్రజలకు ఏం కావాలి? వంటి అనేక విషయాల గురించి ఊహించి.. రాజ్యాంగంలో పరిష్కారాలు పొందు పరిచారు. ప్రపంచంలోనే ఆయనలాంటి మేధావి మరెవరూ లేరు. తెలంగాణ సాధన మనకెంత ప్రత్యేకమో, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కూడా అంతే గొప్ప విషయం. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం భవిష్యత్తు తరాలకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. ఎంతోమంది అంబేద్కర్ను హృదయంలో పెట్టుకుని కూడా బయటికి చెప్పుకోని పరిస్థితులు ఉన్నాయి. ప్రతిఒక్కరూ గర్వంగా చెప్పుకోండి. నేను అంబేద్కరిస్టుని అని కాలర్ ఎగరేసి మరీ చెప్పండి. ఆ పరిస్థితి సీఎం కేసీఆర్ తీసుకురావడం సంతోషకరం.
– డాక్టర్ ప్రతాప్ రెడ్డి, ఐఎంఏ మాజీ చైర్మన్
తెలంగాణ సాధనకు మార్గం చూపిన బాబా సాహెబ్ అంబేద్కర్కు ఓ జ్ఞాపికగా 125 అడుగుల మహా విగ్రహం స్థాపించడం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం. ఇదొక సోషల్ జస్టిస్ సింబల్. పరిపాలన భవనానికి అంబేద్కర్ పేరు చరిత్రక నిర్ణయం. అంబేద్కర్ జయంతి, వర్దంతి అంటే దళిత మేధావులను పిలిచే సంస్కృతి పోవాలి. ఉస్మానియా యూనివర్సిటీలో దీనికి బీజం వేశాం. అంబేద్కర్ అందరివాడు. అంబేద్కర్ వేడుకల్లో అన్ని సామాజిక వర్గాలు పాల్గొనాలి. కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలో అందరి మనసులో అంబేద్కర్ చిరస్థాయిగా నిలిచిపోతారనే నమ్మకం ఏర్పడింది. ఇక్కడిలాగే దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అంబేద్కర్కు సముచిత స్థానం కల్పించాలి. కేసీఆర్ బాటలోనే అందరూ నడవాలి.
– ప్రొఫెసర్ రవీందర్ యాదవ్, ఓయూ వీసీ
దేశం ప్రమాదం వైపు నడుస్తున్నది. ఆర్ఎస్ఎస్ తన విషపు భావజాలాన్ని, మనుధర్మాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దుతున్నది. అంబేద్కర్ చెప్పిన విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నది. ప్రస్తుతం… దేశంలోని అనేక రాష్ర్టాల్లో బాబా సాహెబ్ పేరును పలకడమే నేరమనే పరిస్థితి నెలకొన్నది. దేశంలో అంబేద్కర్ అనే పేరును క్రమేపీ లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఈ తరుణంలో అంబేద్కర్ ఏ చూపుడు వేలుతో జ్ఞానాన్ని అందించాడో, ఆ జ్ఞానాన్ని ఈరోజు దేశానికి అందించాలని కేసీఆర్ భావిస్తున్నారు. చార్మినార్లాగే అంబేద్కర్ విగ్రహం కూడా హైదరాబాద్లో చరిత్రాత్మక కట్టడంగా మిగిలిపోతుంది.
– అల్లం నారాయణ, ప్రెస్ అకాడమీ చైర్మన్