తెలుగు యూనివర్సిటీ, జూన్ 3: హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టేలా కొందరు స్వార్థ రాజకీయాల కోసం కుట్రలు పన్నుతున్నారని, ప్రభుత్వం అణిచివేసేందుకు సిద్ధంగా ఉన్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అసలైన సెక్యులర్ సీఎం కేసీఆర్ అని చెప్పారు. నాంపల్లి రెడ్రోజ్ ఫంక్షన్ హాల్లో శనివారం రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే ప్రయాణికులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హజ్ గైడ్ను ఆవిష్కరించి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించి స్వయం ఉపాధిని కల్పించి ఆదుకుంటుందని వివరించారు. ముఖ్యంగా పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే ప్రయాణికులకు ప్రభుత్వం లక్ష రూపాయల రాయితీ కలిపిస్తుందన్నారు.
ముస్లిం మైనార్టీ విద్యార్థుల కోసం రాష్ట్రంలో పదకొండు వందల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పినట్లు చెప్పారు. షాదీముబారక్తో పాటు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధిని కకల్పించేలా కార్లు అందించినట్లు ఆయన వివరించారు. హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ హజ్ యాత్రికులు తిరిగి వచ్చే వరకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వారికి సేవలు అందించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా హజ్లో ప్రార్థనలు చేయాలని కోరారు. ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీం, సీఈవో ఫఫీ ఉల్లా, సభ్యులు నిజాముద్దీన్, జాఫర్ఖాన్, మక్బుల్ తదితరులు పాల్గొన్నారు.