లక్షలాది ఆలోచనల సంఘర్షణకు ఓ తోవ చూపి.. కోట్లాది గళాలను ఏకం చేసి.. ఉద్యమ గమనానికి మార్గనిర్దేశం చేసి అసాధ్యమైన స్వరాష్ట్ర సంకల్పాన్ని సుసాధ్యం చేసిన శక్తి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించగానే కొత్త చరిత్రకు ఆయన ద్వారాలు తెరిచారు. ఆకలి కేకల పేగులకు పిడికెడు బువ్వ దొరకాలని తపించారు. బడుగులకు నీడనిచ్చేందుకు గూడునివ్వాలని కాంక్షించారు. ప్రతి వ్యక్తి ఆత్మగౌరవంతో శిరస్సునెత్తి బతకాలని ఆశించారు. సబ్బండ వర్ణాలే సంపదను సృష్టించి సమాజాన్ని శాసించే స్థాయికి ఎదగాలన్న సిద్ధాంతాన్ని ఆచరించారు. సమైక్యపాలనతో కమ్మేసిన చీకటి పోయి కొత్త వెలుగులు విరజిమ్మాలని కోరుకున్నారు. ముఖ్యమంత్రిగా, అధికార పార్టీ నేతగా ఒక్కో చిక్కుముడిని విప్పుతూ ఒక్కో సంక్షోభాన్ని నివారిస్తూ కొత్త రాష్ర్టాన్ని వేలు పట్టి ముందుకు నడిపిస్తున్నారు.
అందులో భాగంగానే తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ నగరం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పాత పాలకులు కాసుల కోసం ఈ అందమైన నగరాన్ని విధ్వంసం చేస్తే.. ఒక్కొక్కటిగా పునర్ నిర్మిస్తూ విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నగరాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ విభిన్న జీవన విధానాల, విలక్షణ సంస్కృతుల మేళవింపైన అందమైన పూలబొకేగా వర్ణిస్తారు. ఆ దార్శనికతే ఈ నగరానికి శ్రీ రామ రక్ష. ఆయన నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ఇరవై ఏండ్ల పండుగ జరుపుకుంటున్న నేపథ్యంలో ఉద్యమ పార్టీ, ఉద్యమ రథ సారథి ఏలుబడిలో హైదరాబాద్ నగరం రూపురేఖలు మారిన తీరుపై ప్రత్యేక కథనాలు..
హైదరాబాద్కు 4 శతాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది తెలంగాణ ప్రజల చెమట, నెత్తురుతో నిర్మితమైన నగరం. నిజమైన కాస్మొపాలిటన్ సిటీ. ఈ నగరానికి ఓ వైవిధ్యపరమైన సంస్కృతి, విలక్షణమైన జీవన విధానం ఉన్నది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వారందరినీ చేరదీసి అక్కున చేర్చుకొని ఉద్యోగాలు, ఉపాధి కల్పించే నగరమిది. ఎన్నో మతాలు, సంస్కృతులు, భాషల సంగమమిది. దేశంలో చాలా చోట్ల కనిపించవు కానీ మన మన హైదరాబాద్లో గుజరాతీ
గల్లీ ఉంటది. పార్సి గుట్ట ఉంటది. సింధి కాలనీ, అరబ్ గల్లీ ఉంటయి. ఆళ్వారు ప్రాంతం ఉంటది. బెంగాలీలు, మలయాళీలు, కన్నడిగులు, తమిళులు ఇక్కడే స్థిరపడి మన సంస్కృతిలో లీనమై బతుకుతూ వాళ్ల వాళ్ల ఆచారాలను పండుగలను గొప్పగా నిర్వహించుకునే ఓ అందమైన పూలబొకే లాంటిది మన హైదరాబాద్.
మద్రాస్ లాంటి పట్టణాల కంటే కూడా ముందే అభివృద్ధి చెందింది. హైదరాబాద్కు 1915లోనే కరెంటు వస్తే పన్నెండేళ్ల తర్వాత మద్రాస్కు 1927లో వచ్చింది. దేశంలో ఎక్కడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేని రోజుల్లోనే హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ వ్యవస్థ ఉండేది. ముత్యాల నగరంగా, సిటీ ఆఫ్ గార్డెన్స్గా అప్పటికే పేరు తెచ్చుకున్నది. 1920 నాటికే ఎయిర్ పోర్టు, టెలిగ్రాం సేవలు, దక్కన్ ఎయిర్ లైన్స్ వ్యవస్థ, రైల్వే, నిజాం ఆర్టీసీ ఉండేవి. హైదరాబాద్ నగరాన్ని కులీకుతుబ్షా నిర్మిస్తూ ‘జన్నత్ బనారహా హై’ అన్నాడట. అంటే వేయి
తటాకాలతో, అడుగడుగునా పచ్చటి తోటలతో అందమైన నగరాన్ని నిర్మిస్తున్నానని చెప్పే వాడట.
అలాంటి అందమైన నగరం సమైక్య పాలనలో ఏ ఎదుగుదలకూ నోచుకోక విధ్వంసానికి గురైంది.
తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ను ప్రపంచమే నివ్వెరపోయేలా విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. ఆ బాధ్యత నాది.
హైదరాబాద్ చారిత్రక నగరం..ముత్యాల నగరం.. మినీ ఇండియా..ఇలా రకరకాల నేపథ్యం ఉన్న భాగ్యనగర చరిత్రను ఉమ్మడి పాలకులు పథకం ప్రకారం నాశనం చేశారు. విలాస వస్తువుగా, వ్యాపార కేంద్రంగా మార్చి నగర అభివృద్ధిని విస్మరించారు. ఇక్కడి యాసను హేళన చేశారు. ఇక్కడి సంపదను తమ ప్రాంతాలకు తరలించుకుపోయి రాజభోగాలు అనుభవించారు. వలసపాలకుల దుష్టనీతితో నగరం నానా గోస తీసింది. ఏండ్ల తరబడి పడరాని కష్టాలు పడింది. చివరకు హైదరాబాద్ను తెలంగాణకు దక్కకుండా నానా కుట్రలు పన్నారు. ఎత్తిన జెండా దించకుండా తెలంగాణ రాష్ట్ర సాధనయే ధ్యేయంగా, శ్వాసగా అప్పటి ఉద్యమనేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ను ఒక పథకం ప్రకారం అభివృద్ధి చేశారు. స్వాతంత్య్రం సిద్ధించాక ఏ సర్కారు చేయని పనులను తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండాలని పట్టుబట్టడం వెనుక ప్రధాన ఉద్దేశం హైదరాబాద్. ఇక్కడి ఆస్తులను కాపాడుకోవడం, మరింత పెంచుకోవాలనే కాంక్ష. ఆరు దశాబ్దాల సమైక్య పాలనలో నగర అభివృద్ధి అంతంత మాత్రమే. హైదరాబాద్కు ఉన్న భౌగోళిక, ఇతర అన్నిరకాల అనుకూలతలతో అభివృద్ధిని సాధించిందేగానీ ఉమ్మడి పాలకులకు ఏరోజు కూడా బాగు చేయాలనే ఆలోచన పుట్టలేదు. దీన్ని ఒక వ్యాపార వస్తువుగా, విలాస నగరంగా భావించడం వల్లే ఇక్కడ చారిత్రక నేపథ్యం పథకం ప్రకారం ప్రాభవం కోల్పోయింది. ఇలాంటి నగరాన్ని చేజారకుండా ఆఖరి వరకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. కేంద్ర పాలిత ప్రాంతం.. దేశానికి రెండో రాజధాని…అంటూ కుతంత్రాలు రచించినా బలమైన తెలంగాణ ఉద్యమం ముందు ఫలించలేకపోయింది. హైదరాబాద్ లేని తెలంగాణ అంటే మెడకాయలేని మొండెం అని, మరో యుద్ధానికి సిద్ధమేనంటూ ఉద్యమ నేత కేసీఆర్ సాగించిన పంతం వల్లే హైదరాబాద్తో కూడిన తెలంగాణ సాకారమైంది.
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు ఉంటే వార్త. ఇప్పుడు కరెంటు పోతే వార్త. పారిశ్రామికాభివృద్ధికి కేరాఫ్గా మహా నగరంలో పారిశ్రామికవేత్తలు రోడ్లపైకొచ్చి కరెంటు కోసం ధర్నాలు చేసిన రోజులు ఇంకా గుర్తే ఉన్నాయి. రూ.2374.36 కోట్లతో కొత్త సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లతోపాటు కొత్త లైన్లతో గ్రేటర్ విద్యుత్ వ్యవస్థ సమూలంగా బలోపేతం చేశారు. తద్వారా ఇప్పుడు రెప్పపాటు కూడా కరెంటు పోవడం లేదు. ప్రజా రవాణా అనేది లాభాలు చూసుకోకుండా చేసే సేవ. అందుకే నష్టాల్లోనూ సిటీ బస్సులను నడుపుతున్న ప్రభుత్వం ఆ మేరకు ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకుంటుంది. జీహెచ్ఎంసీ ద్వారా ఒక ఏడాది రూ.156.59 కోట్లు బదిలీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది.
ఆపై కార్పొరేషన్ కూడా ఆర్థికంగా కుంగిపోకుండాప్రభుత్వమే ఆర్టీసీకి నేరుగా నిధులిచ్చి ప్రజా సంస్థను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. తాజా బడ్జెట్లో ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్ల కేటాయించడం విశేషం. ఉమ్మడి పాలనలో హైదరాబాద్ను కాంక్రీట్ జంగిల్లా మార్చేశారు. నిలబడేందుకు నీడ లేకుండా చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో అర్బన్ ఫారెస్ట్ను అభివృద్ధి చేయడంతోపాటు వందలాది పార్కులు, పర్యాటక అభివృద్ధి, కాల గమనంలో కలిసిపోతున్న చెరువులకు పూర్వ వైభవం తెచ్చేందుకు వందలాది కోట్లను వెచ్చించి లంగ్ స్పేస్ను ఏర్పాటు చేసింది.
దేశంలోని ప్రతి మెట్రో నగరం తాగునీటి కొరతతో అల్లాడుతుండగా…సీఎం కేసీఆర్ ముందుచూపు వల్ల నేడు నగరవాసులకు పుష్కలమైన తాగునీరు అందుతుంది. కుత్బుల్లాపూర్ లాంటి ప్రాంతాల్లో 15 రోజులకోసారి అందే దుస్థితి నుంచి ఇప్పుడు నిత్యం సురక్షితమైన మంచినీరు అందే రోజులు వచ్చాయి. నగరంలో ట్రాఫిక్ రద్దీ అంతకంతకూ పెరుగుతుండడంతో కూడళ్లు దాటడం సవాల్ వంటిది. ఈ క్రమంలో అంధులు సులువుగా కూడళ్లు దాటేందుకు జంక్షన్లలోని ట్రాఫిక్ వ్యవస్థలో ప్రత్యేక ఏర్పాటు చేయడం విశేషం. పాదచారులు కూడళ్లలో జీబ్రా లైనుపై నడిచేందుకు ఇచ్చే సిగ్నలింగ్ సమయంలో ప్రత్యేకంగా బీఫ్ శబ్దాన్ని ఇవ్వడం వల్ల అంధులు ఎవరి సహకారం లేకుండానే కూడళ్లు దాటుతున్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ) కింద రూ.25వేల కోట్లతో సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
రాష్ట్రం ఆవిర్భావం నాటికున్న నగరం చిందరవందర. ఇట్లయితే పెట్టుబడులు పెరగవు. ఉపాధి అవకాశాలు రావు అని భావించిన సీఎం..అనేక కార్యక్రమాలకు స్వయంగా రూపకల్పన చేశారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధిని ప్రాధాన్య అంశంగా ఎంచుకున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు..అంటే ఏడేండ్లలో ఏటా రూ.10 వేల కోట్లకుపైగా నిధులతో చేపట్టిన పనులతో ప్రస్తుతం భాగ్యనగర రూపురేఖలే మారిపోయాయి. 6 దశాబ్దాల ఉమ్మడి పాలనలో వచ్చిన మౌలిక వసతుల కంటే అనేకరెట్లు ఈ ఏడేండ్లలో అందుబాటులోకి రావడం విశేషం. 2004-14 వరకు పదేండ్ల కాంగ్రెస్ పాలనలో నగరాభివృద్ధికి రూ.3,934 కోట్లు ఖర్చు చేస్తే…ఏడేండ్లలో రూ.72 వేల కోట్లకు పైగా టీఆర్ఎస్ ప్రభుత్వం వెచ్చించింది.
ఉద్యమ నేతగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్.. దేశాభివృద్ధిపైనా తన దార్శనికతను ప్రదర్శించారు. ముఖ్యంగా హైదరాబాద్తోపాటు దేశంలోని ఇతర మెట్రో నగరాలు మరింత అభివృద్ధిని సాధిస్తే… అంతర్జాతీయంగా భారత్కు మరింత వన్నె వస్తుందని కాంక్షిస్తున్నారు. అందుకే 2014లోనే స్వయంగా ప్రధానమంత్రి మోదీని కలిసిన సమయంలో సీఎం కేసీఆర్ ఏకంగా 45 నిమిషాల పాటు దేశంలోని మెట్రో నగరాలను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై అమూల్యమైన సలహాలు, ప్రణాళికను ఆవిష్కరించారు.
అభివృద్ధి అంటే కేవలం ఆకాశహర్మ్యాలు, వేల కోట్ల రూపాయల వ్యయమే కాదు…మానవీయ కోణాన్ని స్పృషించడమనేది తెలంగాణ ప్రభుత్వ గొప్పతనం. నిత్యం లక్షలాది మంది రాకపోకలు సాగించడంతోపాటు లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధి కోసం ఇంటి నుంచి బయటకు వస్తారు. ఈ నేపథ్యంలో మహానగరంలో కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడమనేది చాలా పెద్ద సమస్య. దశాబ్దాలుగా ఈ సమస్యపై ఆలోచించిన పాలకులు లేరు. తెలంగాణ ప్రభుత్వం నగరంలో ఏకంగా 12వేల టాయిలెట్స్ ఏర్పాటు చేసి చక్కటి నిర్వహణ చేపడుతున్నది. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా షీ టాయిలెట్స్ను కూడా ఏర్పాటు చేశారు.
మెట్రో నగరాలపై సీఎం కేసీఆర్ 45 నిమిషాలపాటు ఇచ్చిన తన విజన్ను విన్న ప్రధాని మోదీ…‘చిట్టీ బిజావ్’ అని చెప్పినట్లు తెలిసింది. అనంతరం సీఎం కేసీఆర్ 2014 జూన్లో ప్రధానికి లేఖ కూడా రాశారు. హైదరాబాద్సహా దేశంలోని ఆరు మెట్రో నగరాలను ప్రత్యేక విజన్తో అభివృద్ధి చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అందులో సూచించారు. ఐటీఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీజియన్)పై దృష్టిసారించాలని కోరారు. ఇదే క్రమంలో హైదరాబాద్లో రోడ్లు, రవాణా, మెట్రోరైలు, భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం వంటి వాటిని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు దశలవారీగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి సహకారం అందించాలని కోరారు. 2016, ఫిబ్రవరి 12న సీఎం కేసీఆర్ స్వయంగా ఇదే అంశాన్ని ఉటంకించారు. కేంద్రం చేపట్టిన అమృత్, స్మార్ట్ సిటీ వంటి పథకాలతో చిన్నచిన్న పట్టణాలు అభివృద్ధిని సాధిస్తాయన్నారు. చిట్టీ బిజావ్ అన్న ప్రధాని మోదీ..ఏకంగా మహానగరాల అభివృద్ధి అనే క్రతువు నుంచి చుట్టీ (సెలవు) తీసుకున్నారేగానీ ఒక విజన్ను ప్రదర్శించకపోవడం అత్యంత విచారకరం.
ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్తో ముందుకెళ్తారు. ఏ పని చేయాలన్నా ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. ఛిద్రమైన తెలంగాణను ప్రణాళిక ప్రకారం పట్టాలెక్కించారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని పలుమార్లు వెల్లడించారు. నేటితరమే కాదు..భావితరాలు బాగుండాలని తపిస్తూ సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతుంటారు. స్వయంగా కేంద్ర మంత్రులు రాష్ర్టానికి వచ్చి ప్రశంసించడమే కాకుండా మిగతా రాష్ర్టాల్లో కూడా అమలు చేస్తామని చెప్పడం వెనుక సీఎం కేసీఆర్ కృషి దాగివుంది. హైదరాబాద్తో పాటు దేశానికి ముఖచిత్రమైన (ఫేస్ ఆఫ్ది ఇండియా) ఆరు మెట్రో నగరాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్రం కూడా చేపడితే తప్ప త్వరితగతిన అభివృద్ధి జరగదని స్వయానా ప్రధాని మోదీకి సూచించిన దార్శనికుడు సీఎం కేసీఆర్. ఇంతటి కీలక సలహాను ప్రధాని విస్మరించినా, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా రాజీపడకుండా నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నది.