కొల్లాపూర్, జూన్ 7 : పాలమూరు రైతులను మోసం చేయొద్దని నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డికి సూచించారు. కొల్లాపూర్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన టూరిస్ట్ స్పాట్కు వచ్చి వెళ్లినట్టు ఉన్నదని విమర్శించారు. ఆదివారం ఆయన కొల్లాపూర్ మండలం రామాపురంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. బస్తాకు 10 కిలోలు తరుగు తీస్తున్నారని రైతులు మాజీ ఎమ్మెల్యేతో మొరపెట్టుకోవడంతో ఆయన ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బీరం మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే తరుగు లేకుండా ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్రెడ్డి పర్యటనకు వచ్చిన ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే రామాపురం ఉన్నదని, సీఎం ఒక్కసారి రైతులతో మాట్లాడి ఉంటే వారి కష్టాలు తెలిసి ఉండేవని అన్నారు. సీఎంను కొల్లాపూర్కు తీసుకొచ్చి ఏం సాధించారో మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజానీకానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసిన జిల్దార్తిప్ప చెరువుకు సాగునీరు, సింగోటం గోపల్దిన్నె లింక్ కెనాల్, బాచారం హైలెవల్ కెనాల్ పనులను ఈ ప్రభుత్వం మరుగున పడిసేందని విమర్శించారు. రామాపురం వాగుపై వంతెన నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం నిలిపివేసిందని దుయ్యబట్టారు. కేసీఆర్ చేసిన కృషితో ఇప్పుడు ఇప్పుడే పాలమూరు రైతాంగం బాగుపడుతున్నదని తెలిపారు. సొంత జిల్లా వ్యక్తి సీఎం అయినా పాలమూరు రైతులకు నష్టం జరుగుతున్నదని ఆరోపించారు.