శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 1: ‘ఒంటిచేత్తో చప్పట్లు’ ఎప్పుడైనా విన్నారా! ఎలా కొడుతారన్న అన్న సందేహం రావడం సహజం! కానీ ఓ మారుమూల గిరిజన విద్యార్థి ఏకంగా నిమిషానికి 300 సార్లు ఒంటిచేత్తో చప్పట్లు కొట్టి ఇండియా బుక్ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించాడు. శంషాబాద్ మండలం మదన్పల్లి పాతతండాకు చెందిన ముడావత్ దశరథ్-రక్కలి భార్యభర్తలు. నిరుపేదలైన వీరు కూలీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి నలుగురు సంతానం. ఉన్నత చదువులు చదివిన ఆ నలుగురు తల్లిదండ్రుల ఆశయాలను కొనసాగిస్తూనే.. మరోవైపు తమలో ఉన్న ప్రతిభను ప్రదర్శిస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. దశరథ్-రుక్కలి రెండో కుమారుడు మున్నా డిగ్రీ పూర్తి చేసి పై చదువుల కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు.
అయితే హర్యానాకు చెందిన నవనీత్సింగ్ 2006లో ఒంటిచేత్తో నిమిషానికి 284 చప్పట్లు కొట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకోగా.. ఇది గమనించిన మున్నా ఎలాగైనా ఈ రికార్డును తిరగరాయాలనుకున్నాడు. కొంతకాలంగా ఒంటిచేత్తో చప్పట్లు కొట్టడం ప్రారంభించాడు. ఆగస్టు 5న నిమిషానికి 300 సార్లు చప్పట్లు కొట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. మున్నా ప్రతిభను గుర్తించిన ఆ సంస్థ అతడి రికార్డును నమోదు చేసింది. షీల్డ్తో పాటు అవార్డులను కొరియర్ ద్వారా పంపించింది. దీంతో కుమారుడికి అవార్డు రావడంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హర్యానాకు చెందిన నవనీత్ సింగ్ ఒంటిచేత్తో చప్పట్లు కొట్టి రికార్డు నమోదు చేయడాన్ని గమనించా. అతడి రికార్డును చెరిపేసి ఆ స్థానంలో నా పేరు రావాలని కొంతకాలంగా ప్రయత్నాలు ప్రారంభించా. ఆగస్టు 5న 300 సార్లు చప్పట్లు కొట్టి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేశా. నా ప్రతిభను గుర్తించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సంస్థ చోటు కల్పించింది. అవార్డును పంపించడం ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు సొంతం చేసుకుంటా. -మున్నా, మదన్పల్లి పాతతండాయువకుడు