అమీర్పేట్, నవంబర్ 26 : సనత్నగర్లోని పబ్బా ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలోని సివిటస్ అపార్ట్మెంట్ నివాసితులకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. తమ అపార్ట్మెంట్కు సరైన రోడ్డు వసతి లేకపోవడంతో పాటు.. డ్రైనేజీ, వరద నీటి కాలువలను అభివృద్ధి చేయాలని కోరుతూ ఇటీవల సివిటాస్ అపార్ట్మెంట్ నివాసితుల సంఘం ప్రతినిధులు మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి తలసాని శనివారం ఉదయం జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో కలిసి సివిటస్ అపార్ట్మెంట్స్ను సందర్శించారు.
ఈ సందర్భంగా అపార్ట్మెంట్స్ రోడ్డులో సమస్యల పరిశీలనకు వచ్చిన మంత్రికి స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో అపార్ట్మెంట్ నివాసితులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సనత్నగర్ ప్రధాన రహదారి నుంచి సివిటాస్ అపార్ట్మెంట్స్ వరకు ఉన్న రోడ్డు పూర్తిగా శిథిలమైన పరిస్థితుల్లో చక్కటి రోడ్డు మార్గాన్ని నిర్మించి ఇవ్వాలని కోరారు.
స్పందించిన మంత్రి ఇటీవలే ఈ రోడ్డుకు సంబంధించి జీహెచ్ఎంసీ అనుమతులు మంజూరయ్యాయని తెలుపడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. సివిటాస్ నివాసితుల సమస్యల పై సానుకూలంగా స్పందించిన మంత్రి వచ్చే ఆరు నెలల్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్పొరేటర్ కొలను లక్ష్మి బాల్రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మోహన్రెడ్డి, టౌన్ప్లానింగ్ ఏసీపీ రమేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.