సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పరిపాలనను మరింతగా పౌరులకు చేరువ చేయాలన్న లక్ష్యంతో వార్డు పాలన వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సమస్యల సత్వర పరిషారానికి పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 150 వార్డుల్లో 10 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. జూన్ మొదటి వారం నుంచి వార్డు పాలన అమల్లోకి వస్తుందని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ శనివారం వెల్లడించారు. గత నెలలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షించిన అనంతరం ఆయన సూచనల మేరకు వార్డు స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి వార్డు కార్యాలయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ఇక ఇంటి ముంగిటకే పౌర సేవలు అందనున్నాయని అర్వింద్కుమార్ పేర్కొన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో వార్డు కార్యాలయాలు ఉండాలని, కనీసం 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ను ఆదేశించారు.