సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): అది ప్రధాన రహదారి… ఆ మార్గంలో ఉన్న ఓ గృహ యజమాని కొత్త కారు కొనడంతో పాత వాహనాన్ని ఇంటి ముందు ఉంచేశాడు. నెలల తరబడి అది అలాగే ఉండటంతో రద్దీ వేళల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. రెండు ప్రధాన రహదారులను కలిపే అంతర్గత రహదారిలో ఉన్న ఇంటి యజమాని రోజుల తరబడి తన వాహనాన్ని రోడ్డుపై పార్కింగ్ చేశాడు. అదేమంటే… ‘నా ఇంటి ముందు నేను వాహనాన్ని పార్కింగ్ చేసుకున్నాను కదా’ అని అంటాడు. నిత్యం ట్రాఫిక్ జామ్లకు ఆ పార్కింగ్ వాహనమే కారణంగా మారిందని స్థానికులు తరచూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ఇలా… రోజులు, నెలల తరబడి రహదారులపై పార్కింగ్ చేసే వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించనున్నారు. ఇప్పటికే మూడు వందల వరకు ఇలాంటి వాహనాలను గుర్తించిన పోలీసులు.. ఆయా యజమానులకు నోటీసులు కూడా జారీ చేశారు. ఆ వాహనాలను తరలించేందుకు త్వరలో స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు.
నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై రోజుల తరబడి వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నదని ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొందరు కొత్తవి కొనడం లేదా ఒకటి కంటే ఎక్కువ ఉందనో.. వాహనం పూర్తిగా చెడిపోయిందనో.. ఇలా వివిధ కారణాలతో రోడ్లపై ఆ వాహనాలను పార్క్ చేసి చేతులు దులుపుకొంటున్నారు. ఫలితంగా నిత్యం ట్రాఫిక్జామ్లతో ప్రయాణికులు నరకం అనుభవిస్తారు. పైగా ఆయా చోట్ల ట్రాఫిక్ను క్లియర్ చేయడం సిబ్బందికి సవాలుగా మారుతున్నది.
రోడ్లపై ఇష్టానుసారంగా నెలల తరబడి పార్కింగ్ చేసే వాహనాలను తొలగించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నాం. ఆయా వాహనదారులకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ ప్రారంభించాం. చాలా మంది తమ పాత వాహనాలను రహదారులపై ఉంచేసి.. తక్కుగా మారినా వాటిని మాత్రం అక్కడి నుంచి తొలగించడం లేదు. ఇలాంటి వారిపై ముందుగా దృష్టి పెడుతాం.
– ట్రాఫిక్ జాయింట్ సీపీ, ఏవీ రంగనాథ్
రోడ్లపై ఉండే వాహనాలను గుర్తించి..తొలుత యజమానులకు ముందస్తు హెచ్చరిక చేయడంతో పాటు అవగాహన కల్పిస్తారు. జనం పడుతున్న ఇబ్బందులను వారికి వివరిస్తారు. నోటీసులు కూడా జారీ చేస్తారు. ఒకవేళ యజమాని తీరు మారకపోతే జరిమానా విధిస్తారు. అంతేకాదు రోడ్డుపై ఉండే వాహనాలను గోషామహల్ స్టేడియం లేదా ఇతర నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాలకు తరలిస్తారు.