సిటీబ్యూరో, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): ఢిల్లీ కేంద్రంగా నగరంలో విదేశీ సిగరేట్లను విక్రయిస్తున్న వ్యక్తిని నగర టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముందుగా అక్రమంగా నిల్వచేసి ఉంచిన గోదాంపై దాడులు జరిపిన పోలీసులు విక్రయాలకు పాల్పడుతున్న మనోహర్ సింగ్ను అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి రూ.3,0500 విలువ చేసే విదేశీ సిగరేట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రకారం.., రాజస్థాన్ ప్రాంతానికి చెందిన మనోహర్ సింగ్(26) వృత్తి రీత్య వ్యాపారి. ఉపాధి కోసం ఆరేండ్ల క్రితం నగరానికి వలస వచ్చిన మనోహర్ ప్రస్తుతం, అఫ్జల్గంజ్లోని అశోక్ బజార్లో ఉంటున్నాడు. వ్యాపారంలో భాగంగా సిగరేట్ లైటర్స్ మార్కెటింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో విదేశీ సిగరేట్లను విక్రయించాలని నిర్ణయించుకున్నాడు.
ఇందులో భాగంగా ఢిల్లీకి చెందిన రోహిత్ శర్మను సంప్రదించి అతడి వద్ద ఎలాంటి పన్ను లేకుండా తక్కువ ధరకు విదేశీ సిగరేట్లను కొనుగోలు చేసి, ప్రైవేటు వాహనాలలో నగరానికి తరలిస్తున్నాడు. అనంతరం, నగరంలోని పాన్షాప్లు, కిరాణా దుకాణాలు, ఇతర చిరు దుకాణాలలో అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అఫ్జల్గంజ్లోని అశోక్ బజార్లో ఉన్న గోదాంపై దాడులు జరిపి, అక్రమంగా విదేశీ సిగరేట్లను విక్రయిస్తున్న మనోహర్ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.3,05000 విలువైన 11 రకాల విదేశీ బ్రాండ్లకు చెందిన సిగరెట్లను సీజ్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును షాహినాయత్ గంజ్ పోలీసులకు అప్పగించారు.