సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): వర్షాల వేళ వరద ముప్పు తప్పించాలని కోరుతూ పలువురు నగరవాసులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నగర శివార్లలో వరద కాలువలను మురుగుకాలువలకు కలపకుండా వరద నీరు నేరుగా చెరువుకు చేరేలా చూడాలని వారు కోరారు. సోమవారం బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 47 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా సిబ్బంది తెలిపారు.
మియాపూర్ -గండిమైసమ్మను కలుపుతూ ఆరులైన్ల రహదారికి ఆనుకుని ఇరువైపులా నిర్మిస్తున్న ప్రధాన వరదకాలువలు ప్రగతినగర్లోని పైపులకు అనుసంధానం చేయడంతో భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఏర్పడుతాయని, ఇరువైపులా 1200 ఎంఎం చొప్పున 2400 ఎంఎం పైపులకు అనుసంధానం చేయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నించారు. ప్రగతినగర్లో తీవ్రమైన వరద ముప్పు ఉన్నదని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ డివిజన్లోని సర్వేనెంబర్ 78,79లో 30 సంవత్సరాల క్రితం టెలిఫోన్కాలనీ పేరిట లేఐట్ వేశారని, అందులో ఉన్న 1166 గజాల పార్కు స్తలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నట్లు కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నెక్నాంపూర్లోని సచివాలయం కాలనీ లేఔట్ హద్దులు నిర్ధారించాలని ఆ ప్రాంతవాసులు కోరారు. షామీర్పేట మండలం పోతాయిపల్లి సర్వే 118లో ఉన్న 5.18కరాల మాజిద్కుంట చెరువును కాపాడి వరద కట్టడికి వినియోగించాలని ప్రజావాణి ఫిర్యాదులో అక్కడ స్థానికులు కోరారు. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించి తదుపరి చర్యలకు ఆదేశించారు.