నగరం పల్లెబాట పట్టింది.సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పిల్లాపాపలతో కలిసి సొంతూళ్లకు వెళ్లేందుకుసిద్ధమవుతున్నారు. దీంతో అన్ని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. మరీముఖ్యంగా సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లతో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్లు రద్దీగా మారాయి. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా ఇటు ఆర్టీసీ, అటు రైల్వే అధికారులు సర్వీసులను పెంచారు.
మారేడ్పల్లి /మన్సూరాబాద్, జనవరి 10: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నగర వాసులు పల్లెబాట పడుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్, సీబీఎస్ బస్టాండ్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. రద్దీకి అనుగుణంగా రైళ్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు రైల్వే టికెట్లు దొరకలేని పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు రైల్వే స్టేషన్, రైళ్లలో బందోబస్తును నిర్వహిస్తున్నారు.
15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు
ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు పికెట్ డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. నగరంలోని జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లతో పాటు ఆయా ప్రాంతాల నుంచి తెలంగాణలో 2,720, ఆంధ్రప్రదేశ్కు 1356, కర్ణాటకకు 1011, మహారాష్ట్రకు 56 బస్సులు (ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, రాజధాని, డీలక్స్)లను నడుపుతున్నట్లు వెల్లడించారు. ఎల్బీనగర్, ఉప్పల్ రింగ్ రోడ్డు ప్రాంతాలు రద్దీగా మారాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ, ట్రాఫిక్, రవాణ శాఖ అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు
నగరం నుంచి జిల్లాలకు వెళ్లేందుకు ఎల్బీనగర్ రింగ్రోడ్డులోని బస్టాప్ వద్దకు వచ్చే ప్రయాణికులు సేద తీరేందుకు టీఎస్ఆర్టీసీ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేసింది. దీంతో పాటు సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ ప్రజలు తమ గమ్యస్థానాలకు తరలివెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు.
విజయవాడ వైపు క్యూకట్టిన బస్సులు
ఏపీ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే ప్రజలు తండోప తండాలుగా ఎల్బీనగర్ రింగ్రోడ్డుకు చేరుకోవడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. వారిలో ఎక్కువగా విజయవాడ వెళ్లే వారు ఉండటంతో టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఎల్బీనగర్ రింగ్రోడ్డుకు చేరుకుంటున్న ప్రయాణికుల సంఖ్యను బట్టి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ స్పెషల్ బస్సులను రప్పిస్తూ ప్రజలను వారి గమ్యస్థానాలకు పంపిస్తున్నారు.