సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ‘కష్టపడి ఉద్యోగం సాధించారు..కమిట్మెంట్తో పనిచేయండి’ అని నూతనంగా ఎంపికైన పోలీస్ కానిస్టేబుళ్లకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సూచించారు. ఫ్లేట్ల బురుజులోని సిటీ పోలీస్ శిక్షణ సంస్థలో ఇటీవల నియమితులైన 268 ఎస్సీటీపీసీ(ైస్టెపండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్), ఏఆర్(మహిళలు), రాష్ట్రం నలుమూలల నుంచి డ్రైవర్లు, మెకానికల్ తదితర విభాగాలకు చెందిన 9 నెలల బేసిక్ ఇండక్షన్ శిక్షణకు రిపోర్టు చేశారు. బుదవారం వాళ్లకు శిక్షణ ప్రారంభమవ్వగా, ఈ కార్యక్రమానికి సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంపై పూర్తి అవగాహన పెంచుకొని.. ప్రజల ఆస్తులను కాపాడాలని, విధి నిర్వహణలో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. వృత్తి ధర్మాన్ని క్రమ శిక్షణ, సమయపాలన పాటిస్తూ, కమిట్మెంట్తో విధులు నిర్వహిస్తూ పోలీస్ శాఖకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్ హెడ్ క్వార్టర్స్ జాయింట్ సీపీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
శిక్షణలో సంస్థాగత విలువలు పాటిస్తూ, సమాజంపై పూర్తి అవగాహన పెంపొందించుకుంటూ వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకోవాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి సూచించారు. కొత్తగా నియామకమైన ైస్టెంపడరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు 9 నెలల పాటు జరిగే బెసిక్ ఇండక్షన్ శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిద్దిపేట, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం యూనిట్లకు చెందిన 196 మందికి శిక్షణ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగం సాధించడం కోసం కొన్ని లక్షల మంది నిరుద్యోగులు అహోరాత్రులు కష్టపడి చదివి ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తారని, అందులో కొందరికే ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందన్నారు. అందులో మీరు ఉన్నారని, తెలంగాణ పోలీసులకు దేశంలోనే బెస్ట్ పోలీసింగ్గా గుర్తింపు ఉన్నదన్నారు. కొత్త విషయాలను నేర్చుకోవడం కోసం శిక్షణ సమయం చక్కని అవకాశమని, స్వీయ క్రమ శిక్షణ పాటించాలని సూచించారు. జాయింట్ సీపీ ట్రాఫిక్, జోయెల్ డేవిస్ మాట్లాడుతూ 9 నెలల శిక్షణపైనే సర్వీస్ మొత్తం ఆధారపడి ఉంటుందని, శిక్షణలో అన్ని విషయాలు తెలుసుకోవాలని, సోషల్మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలతో మమేకమై క్షేత్ర స్థాయిలో కానిస్టేబుళ్లు పనిచేస్తారని, డిపార్టుమెంట్లో కానిస్టేబుల్ పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో సీటీసీ ప్రిన్సిపాల్ డీసీపీ ఎల్సీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.