అబిడ్స్/ఖైరతాబాద్, అక్టోబర్ 11 : డిజిటల్ సేవలు అధునీకతకు నిదర్శనమని, వాటిని సురక్షితంగా వినియోగించుకోవాలని వుమెన్ సేఫ్టీ వింగ్, సీఐడీ విభాగం డీఐజీ సుమతి అన్నారు. రూమ్ టు రీడ్ ఆధ్వర్యంలో లక్డీకాపూల్లోని హోటల్ సెంట్రల్ కోర్టులో ‘మీ అండ్ మై డిజిటల్ వరల్డ్’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు డీఐజీ సుమతి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. యువత డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నారు కానీ.. తెలిసి తెలియని పరిజ్ఞానంతో నష్టపోతున్నారని అన్నారు. ఇంటర్నెట్ వినియోగంలో అవగాహన అవసరమని, అది లేకపోవడం సైబర్ నేరాల వలలో చిక్కుకుంటున్నారన్నారు. డిజిటల్ రంగంలో లాభాలతో పాటు నష్టాలూ ఉన్నాయని తెలిపారు. తమ పోలీసు శాఖ ఆధ్వర్యంలో 4,450 పాఠశాలల్లో సైబర్ అంబాసిడర్ లాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించామని, పిల్లలనే ఇందులో భాగస్వాములను చేసి తద్వారా సైబర్ నేరాలపై అవగాహన పెంచడంలో సఫలీకృతులమయ్యామని చెప్పారు. విద్యార్థినులు సైబర్ మోసాలు, ఆన్లైన్ ఫ్రెండ్షిప్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రూమ్ టు రీడ్ సంస్థ డిజిటల్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం గొప్ప విషయమన్నారు. రూమ్ టు రీడ్ ప్రొగ్రాం అధికారి సరిత మాట్లాడుతూ సైబర్ సేఫ్టీపై ఎనిమిది పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, 2కే రన్, ప్రతి పాఠశాలల్లో డిజిటల్ సేఫ్టీపై పోస్టర్ల ప్రదర్శన తదితర కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సదస్సులో హైదరాబాద్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు రాజేశ్, రూమ్ టు రీడ్ స్టేట్ మేనేజర్ నర్సింహాచారి, సీరియర్ ప్రొగ్రాం అసోసియేట్ లక్ష్మణ్, సీనియర్ సోషల్ మోబిలైజర్ రాధిక, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ జగన్, ప్రోగ్రాం ఆఫీసర్ సరిత, సంస్థ సోషల్ మొబిలైజర్స్ తదితరులు పాల్గొన్నారు.