కొవిడ్ కారణంగా చిలుకూరు బాలాజీ ఆలయంలో నిలిచిపోయిన ఆలయ ప్రదక్షిణలు నేటి నుంచి తిరిగి ప్రారంభిస్తామని ఆలయ అర్చకుడు రంగరాజన్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆలయ గర్భగుడి చుట్టూ భక్తులు 11 లేదా 108 ప్రదక్షిణలు చేసేవారని, ఏడాదిన్నర నుంచి వాటిని పూర్తిగా నిలిపివేశామని పేర్కొన్నారు. భక్తులు ప్రదక్షిణల కోసం అర్థిస్తున్నారని, వారి కోరికను మన్నిస్తున్నామని వివరించారు. ఆలయ ప్రాకారం చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తే గర్భగుడి చుట్టూ 11 ప్రదక్షిణలతో సమానమని ఆయ న స్పష్టం చేశారు. 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకునే భక్తులు మహా ప్రాకారం చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే సరిపోతుందని భక్తులకు రంగరాజన్ సూచించారు.