సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సైబర్క్రైమ్ స్టేషన్కు ఈ మధ్యకాలంలో వరుసగా వస్తున్న ఫిర్యాదులను పరిశీలిస్తే ఇళ్లల్లో పిల్లలు ఆన్లైన్ ఉచ్చులో పడి తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోయేలా చేస్తున్న విషయం వెలుగు చూసిందని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. ఫోన్లతో తమ బ్యాంక్ ఖాతాలు హ్యాక్ అయ్యాయని ఇటీవల సైబర్ క్రైమ్ స్టేషన్కు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో బుధవారం సీపీ సజ్జనార్ నగరంలోని చిన్నారుల తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు.
సైబర్ క్రైమ్ స్టేషన్కు వస్తున్న ఫిర్యాదులు బయటకు కేవలం ఆర్థిక నేరాలుగానే కనిపిస్తున్నాయి కానీ వాటి వెనుక ముఖ్యంగా ఆన్లైన్ గేములకు పిల్లలు బానిస కావడం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడం ప్రధాన కారణాలని తెలిపారు. నగరంలోని కొందరు తల్లిదండ్రులు తమ మొబైల్కు వరుసగా డెబిట్ మెసేజ్లు రావడంతో తమ బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత బయటపడిన విషయాలు తల్లిదండ్రులను షాక్కు గురిచేసిందని సజ్జనార్ చెప్పారు.
ఈ వ్యవహారంలో ఎలాంటి హ్యాకింగ్ కానీ మోసపూరిత లింకులు కానీ లేవని, కేవలం పిల్లలే ఫ్రీఫైర్, ఫ్రీఫైర్ మ్యాక్స్ వంటి ఆన్లైన్ మల్టీప్లేయర్ ఆటల్లో వర్చువల్ కాయిన్స్, డైమండ్స్ కొనుగోలు చేయడానికి ఫోన్లో సేవ్ చేసిన కార్డ్స్ లేదా యూపీఐ వివరాలను వాడుతున్నట్లుగా తేలిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా తాతయ్యలు, నానమ్మల ఫోన్లలో యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయి ఉండడంతో పిల్లలు సులభంగా వేల రూపాయల లావాదేవీలు చేస్తున్నారని చెప్పారు. ఇది సాంకేతికంగా నేరం కానప్పటికీ, కేవలం ఇంట్లో పర్యవేక్షణ లోపం వల్ల జరుగుతున్నదని, ఇటువంటి అజాగ్రత్తల వల్ల అసలైన సైబర్ నేరస్తులను పట్టుకోవలసిన పోలీసుల విలువైన సమయం వృథా అవుతున్నదన్నారు.
చిన్నారుల భవిష్యత్ను నాశనం చేస్తున్న ఇటువంటి గేమింగ్ యాప్ల అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వీటి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకునేలా గూగుల్ వంటి అంతర్జాతీయ సాంకేతిక సంస్థలకు లేఖలు రాస్తామని పేర్కొన్నారు. చిన్నారులను ఆన్లైన్ ఆటల ముప్పు నుంచి కాపాడుకునేందుకు తల్లిదండ్రులు తక్షణమే కొన్ని రక్షణ చర్యలు చేపట్టాలని, మొదటగా పిల్లలు వాడే ఫోన్ల నుంచి సేవ్ చేసిన బ్యాంక్ కార్డులు, యూపీఐ ఆటోఫిల్ వివరాలను తొలగించి, ప్రతీ లావాదేవీకి పిన్ లేదా బయోమెట్రిక్ లాక్ తప్పనిసరి చేయాలని సూచించారు. గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్లలో పేరంటల్ కంట్రోల్స్, పర్చేజ్ అప్రూవల్స్ ఆన్ చేసుకోవాలని, బ్యాంక్ అలర్ట్ మెసేజ్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటి ప్రాముఖ్యతను ఇంట్లో ఉన్న వృద్ధులకు, పెద్దవారికి వివరించాలన్నారు. ఆన్లైన్ ఆటలను కేవలం వినోదం కోసమే ఉపయోగించాలని, పరిమిత పరిధుల్లోనే ఆడేలా చూడాలని తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు.