మియాపూర్ : అయిదేండ్ల లోపు చిన్నారులందరికీ తప్పకుండా పోలియో చుక్కలను వేయించాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తల్లిదండ్రులను కోరారు. ఈ మేరకు ఈ నెల 27 వ తేదీ ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంపై రూపొందించిన పోస్టర్ను గురువారం తన నివాసంలో విప్ గాంధీ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో చుక్కలు చిన్నారులకు శ్రీ రామ రక్షయని, తప్పక ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుని తమ చిన్నారులకు విధిగా వేయించాలన్నారు. ఆరోగ్య భారత్ను నెలకొల్పేందుకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించా లని విప్ గాంధీ పిలుపునిచ్చారు. దీనిపై ప్రజలలో అవగాహన కలిపించేందుకు ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తున్నదన్నారు.
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దవాఖానాలు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు సహా ప్రధాన కూడళ్ల వద్ద ఆరోగ్య సిబ్బంది పోలియో చుక్కలు వేస్తారని విప్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లమ్మబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మానస, నర్సులు నదియా, జ్యోతి, సంతోషి, పార్టీ నేతలు రవీందర్, సంజీవరెడ్డి, లక్ష్మీనారాయణ, ఇబ్రహీం తదితులు పాల్గొన్నారు.