తెలుగు యూనివర్సిటీ, జూన్ 11. తెలుగు భాషని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగువారందరిపైన ఉందనీ, మాతృభాష గొప్పతనాన్ని పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులపైన ఉందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అన్నారు. అబిడ్స్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రంథ పురస్కారాలు -2025, వరిష్ట పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ ఉద్యమం అయిన రచయితల రచనలతోనే ఊపందుకుంటుందని, తెలంగాణ ఉద్యమం కూడా రచయితల వలన గొప్పగా నడిచిందన్నారు. నేడు సినిమా కల్చర్ ఎక్కువగా పెరగడం వలన సాహిత్యాన్ని ఎవరూ ఆదరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషని కాపాడుకోవాలి అంటే కచ్చితంగా సాహిత్యాన్ని కాపాడుకోవాలన్నారు .
తెలుగు భాష గొప్పతనాన్ని , మాతృభాషలో ఉన్న అమృతాన్ని పిల్లలకు తెలియజేయాలని తల్లిదండ్రులను కోరారు. మమ్మి అంటే దయ్యం, అమ్మ అంటే కన్నతల్లి అనే గొప్ప విషయాన్ని పిల్లలకు అర్ధం అయ్యేలా వివరించాలని ఆయన తెలిపారు. పరిషత్ అధ్యక్షుడు ఆచార్య శివారెడ్డి మాట్లాడుతూ.. పెద్దలు చూపిన మార్గంలో పరిషత్ను ఆదర్శప్రాయంగా నిర్వహిస్తామన్నారు. 2025 సంవత్సరానికి పద్య గేయ విభాగంలో కాంచనపల్లి గోవర్ధనరాజు, వచన కవిత విభాగంలో డాక్టర్ ఉదారి నారాయణ, కథా ప్రక్రియలో రామచంద్రమౌలి, నవల విభాగంలో డాక్టర్ కాలువ మల్లయ్య, సాహిత్య విమర్శలో డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, ఇతర ప్రక్రియలలో డాక్టర్ సంగంపట్ల నర్సయ్య, డాక్టర్ అమరవాది నీరజ పురస్కారాలను అందుకున్నారు. వరిష్ఠ పురస్కారాలను రంగరాజు పద్మజ, నాగరాజు సురేంద్ర, డాక్టర్ వెంకటేశం, రూప్ కుమార్ డబ్బీకార్ అందుకున్నారు. పరిషత్ కోశాధికారి రామారావు, కార్యవర్గ సభ్యులు రింగు రామ్మూర్తి పాల్గొన్నారు.