కరోనా రెండోదశ ఉప్పెనలా విజృంభిస్తుండడంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఎక్కడికెళ్లాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, కలువాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ప్రధానంగా యువత కరోనా బారిన పడుతుండడంతో కుటుంబాల్లో ఆందోళన నెలకొన్నది. అయితే పిల్లల్లో రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటుందని మొదటి దశలో అనుకునేవారం. కానీ రెండోదశలో పిల్లలే కరోనా క్యారియర్స్గా మారుతున్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఆపత్కాలంలో పిల్లలను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. వైరస్ బారిన పడకుండా చూడాలి. స్కూళ్లు లేకపోవడంతో రోజంతా ఇంట్లో ఉంటున్న పిల్లల అల్లరి అంతాఇంతా కాదు. అయినా ఓపిగ్గా అల్లరి భరించి కరోనా నుంచి సంరక్షించుకోవడమే పెద్ద సవాల్. ఆన్లైన్ క్లాసుల సమయంలో కొంత కుదురుగా ఉన్నప్పటికీ..ముగిశాక విపరీత అల్లరి చేస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు.
పిల్లలు అల్లరి చేస్తున్నారని..వారు అడిగింది కొనివ్వడం..బయటకెళ్లినా పట్టించుకోకపోవడం లాంటి చర్యలు వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. చిన్నారుల కదలికలపై పర్యవేక్షణ లేకపోతే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఆరు బయట ఆడుకుంటే శుభ్రతను మరిచిపోతారు. నేలను చేతులతో తాకడం..చేతులను కండ్లు, ముక్కు, నోరును ముట్టుకోవడం తెలియకుండానే చేస్తారు. దీనివల్ల కరోనా సోకే అవకాశం లేకపోలేదు.
కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ముందు ఘర్షణలకు దిగుతుంటారు. ఈ ప్రభావం పసి మనసులపై తీవ్రంగా ఉంటుంది. వారితో ప్రేమగా ఉండాలి. చిన్నచిన్న విషయాలకు వారిపై కోపం చూపొద్దు. ప్రస్తుత కరోనా పరిస్థితిని వివరించి చెప్పాలి. – శైలజ, సైకాలజిస్టు
రోజంతా పిల్లలు ఇంట్లోనే ఉండటంతో బోర్ గా ఫీలవడం సహజం. పిల్లలు అల్లరి చేస్తున్న సమయంలో వారి దృష్టిని మరల్చడానికి వారికి నచ్చిన వస్తువులను ఆన్లైన్లో కొనివ్వడం వల్ల దృష్టి మళ్లుతోంది. ఎంత గొడవ చేసినా బయటకెళ్లకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాం. – రాధ, కూకట్పల్లి