సిటీబ్యూరో, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ): ఇంటి భోజనం కంటే బయట దొరికే చిరుతిళ్లతో బాల్యం బరువెక్కుతోంది. వయసుకు మించిన అధిక బరువుతో బాలల భవిష్యత్తు రోగాల పాలవుతుంది. జంక్ ఫుడ్ ప్రభావాన్ని అంచనా వేసిన జాతీయ పోషకాహార సంస్థ.. పెరుగుతున్న చైల్డ్ ఒబెసిటీ తీరును విశ్లేషించింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతోపాటు, టైర్ – 2, టైర్ – 3 పట్టణాలను ఎంపిక చేసుకొని అధ్యయనం చేయగా చిన్న పిల్లలకు ఊబకాయం ప్రమాదకరంగా మారుతుందని తేల్చింది. దీంతో చిన్నతనంలోనే ఎక్కువగా డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల భారిన పడుతున్నారని వెల్లడించింది.
జంక్ ఫుడ్తోనే
అధిక బరువుకు ప్రధాన కారణాలపై పరిశోధనలు జరిపిన పోషకాహార నిపుణులు.. 53శాతం మంది ఊబకాయానికి జంక్ ఫుడ్ అని తేల్చారు. ఇందులో మెజార్టీ జనాలు కూడా మెట్రో ఫుడ్ కల్చర్ బారిన పడినవారేనని తేలింది. ఆరోగ్యకరమైన ఆహారం కంటే బయట దొరికే ఇన్స్టాంట్ ఫుడ్ను ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలోకి పరిమితికి మించి కొవ్వు చేరి ఊబకాయం క్రమంగా పెరుగుతుందని విశ్లేషించారు. 2004, 2008, 2012, 2018లో ఊబకాయం పెరుగుతున్న తీరును ఐసీఎంఆర్ పరిశీలించింది. ఇందులో 5-17 ఏళ్లలోపు పిల్లలలో ఊబకాయం పరిమాణం క్రమంగా విస్తరిస్తున్నదని అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది.
తీసుకునే ఆహారం శారీరక ఎదుగుదలతోపాటు, మానసిక సామర్థ్యాన్ని నిర్ధేశిస్తోంది. ముఖ్యంగా మెదడు పనితీరును ప్రభావితం చేసే ఎన్నో రకాల పోషకాలు జంక్ ఫుడ్లో లోపిస్తున్నాయి. దీంతో శరీరంలోకి అదనపు కొవ్వు మాత్రమే చేరుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎన్ఐఎన్ చేసిన అధ్యయనంలో మానసిక ఎదుగుదలకు జంక్ పుడ్ ప్రతికూలంగా మారుతుందని తేలింది. చిన్నపిల్లలతోపాటు పెద్దలపైన కూడా ఈ ప్రభావం చూపుతుందని, డిప్రెషన్, మెంటల్ స్ట్రెస్ పెరిగేందుకు అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
పిజా, బర్గర్, ఫాస్ట్ ఫుడ్ కల్చర్తో ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు ఇంట్లో చేసిన ఆహారాన్ని అందించిన తల్లిదండ్రులే ఇప్పుడు పిల్లలకు జంక్ ఫుడ్ పెడుతున్నారు. ముఖ్యంగా పిల్లలకు పోషకాలు అందించే క్రమంలో కొంతమంది తల్లిదండ్రులు అవసరానికి మించి ఆహారాన్ని అందించడంతో.. వయసుకు మించిన అధిక బరువుతో బాధపడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.